అన్నార్తులు.. అనాథలు లేని దేశం కోసం జాతిపిత మహత్మాగాంధీ చూపిన దారిలో పునరంకితమవుదాం.. భారతదేశాన్ని కాపాడుకుందాం.
– సీఎం కేసీఆర్
నగరమంతా.. త్రివర్ణ శోభితమైంది.. ప్రతి గుండెలో భారతీయత ఉట్టిపడింది.. దేశభక్తి రగిలేలా.. స్వత్ంర్రత్ర భారత వజ్రోత్సవాలు సోమవారం మాదాపూర్లోని హెచ్ఐసీసీలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలుత జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం కేసీఆర్.. జెండావందనం చేసి.. వేడుకలకు శ్రీకారం చుట్టారు. వాడవాడలా స్వతంత్ర స్ఫూర్తి తెలిసేలా ఉత్సవాలు నిర్వహించాలని, జాతిని చీల్చే కుట్రలను.. ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. మరోవైపు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగిరేలా.. బల్దియా ఇంటింటా జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నది. స్వయం సహాయక బృందాలతో 20 లక్షల గృహాలకు త్రివర్ణ పతాకాలు చేరేలా ఏర్పాట్లు చేసింది. ఇంటికి ఒకటి చొప్పున 25 లక్షల స్టిక్కర్లు అందించనున్నది.
మనం ఒక పవిత్ర కర్తవ్యాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. రాష్ర్టాన్ని కొంతలో కొంత మనం బాగుచేసుకోగలిగాం. రాష్ట్రం కావాలనే పోరాటం, ఆ తదనంతర కాలంలో 8 సంవత్సరాలు ప్రజలు మనకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని కొన్ని ప్రాథమిక, మౌలిక సదుపాయాలు,వసతులుకల్పించుకోగలిగాం. ఇంకా పురోగమించాల్సింది, జరగాల్సింది చాలా ఉంది. ఇలాంటి సందర్భంలో ఒక కఠోరమైన వాస్తవాన్ని మనమందరం అంగీకరించక తప్పదు. ఆ వాస్తవాన్ని మనం సమీక్షించుకోవాలి, స్ఫూర్తి పొందాలి. ఆ దిశగా ప్రతిజ్ఞ బూని కదలాల్సిన అవసరం ఉంది.
ఒక కూర్పులో చాలా కష్టం ఉంటుంది. చాలా ప్రయాస ఉంటది. మన కుటుంబాన్ని కూర్చాలన్నా, గ్రామాన్ని, తాలుకాను, జిల్లాను, రాష్ర్టాన్ని కూర్చాలన్నా చాలా ప్రయాస ఉంటది. ఈ రోజు తెలంగాణ పునర్నిర్మాణంలో మీరంతా ఎంత ప్రయాస పడుతున్నారో నాకు తెలుసు. అన్ని శాఖల అధికారులకు తెలంగాణ ప్రజల పక్షాన సెల్యూట్ చేస్తున్నా. తెలంగాణ గౌరవాన్ని, గర్వాన్ని జాతీయస్థాయి యవనికలో చేర్చిన మీకు తెలంగాణ ఎల్లప్పుడు రుణపడి ఉంటుంది.
– సీఎం కేసీఆర్
సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ)/మాదాపూర్/కొండాపూర్: స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ప్రారంభోత్సవం హైదరాబాద్ హెచ్ఐసీసీలో సోమవారం అట్టహాసంగా కొనసాగింది. వేడుకలు ఆద్యంతం అంబరాన్నంటాయి. వజ్రోత్సవ ఉత్సవ కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అధ్యక్షతన కొనసాగిన ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై హెచ్ఐసీసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఉదయం 11.35 గంటలకు ఆవిష్కరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత వేదికపై ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, భారతమాత విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రజానీకానికి స్వతంత్ర భారత వజ్రోత్సవ సందేశాన్ని వినిపించారు. ముందుగా రాష్ట్ర ప్రజానీకానికి, యావత్ దేశానికి స్వతంత్ర భారత వజ్రోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వేడుకల్లో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, మంత్రులు మహమూద్ అలీ, హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్యాదవ్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జడ్పీటీసీలు, మున్సిపల్ మేయర్లు, చైర్పర్సన్లు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.
హెచ్ఐసీసీలో సభా ప్రాంగణానికి వెళ్లే వారిని ఆకర్శించేలా ‘లవ్ హెచ్ఐసీసీ’ అనే థీమ్తో పాటు వెనకాల ఏర్పాటు చేసిన జాతీయ జెండాలు రెపరెపలాడుతూ అందరినీ ఆకట్టుకున్నాయి. జెండాలకు ఎదురుగా బంతిపూలు, ఆకులతో మరో జాతీయ జెండా థీమ్ను ఏర్పాటు చేశారు. వజ్రోత్సవాల పేరుతో ఏర్పాటు చేసిన మరో థీమ్ ఆకర్షించేలా ఉండటంతో అక్కడకు వచ్చిన వారందరితో పాటు పోలీసులు సైతం ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
వజ్రోత్సవాలకు వచ్చిన మూడు వేల మందికి ఎనిమిది రకాల వంటకాలను ఏర్పాటు చేశారు. చికెన్ బిర్యానీ, బగార రైస్, మిర్చి మసాల, గుత్తి వంకాయ, పప్పు, సాంబర్, పాపడ్, పచ్చడి, పెరుగు ఏర్పాటు చేశారు.