మెహిదీపట్నం, ఆగస్టు 8: ఆర్టీసీ బస్సు డ్రైవర్ను తీవ్ర పదజాలంతో దూషించడమే కాకుండా రాడ్ సహాయంతో దాడి చేసేందుకు ప్రయత్నించిన ఈ వ్యక్తి ఆచూకీ చెప్పండి.. అంటూ ఆసిఫ్నగర్ పోలీసులు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇన్స్పెక్టర్ సీహెచ్. శ్రీనివాస్ వివరాల ప్రకారం.. జూలై 20వ తేదీ రాత్రి మెహిదీపట్నం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 23, 24 మధ్యలో గుర్తు తెలియని ఓ వ్యక్తి తన కారుతో ఆర్టీసీ బస్సును అడ్డుకున్నాడు. తనకు సైడ్ ఇవ్వలేదంటూ కారులో ఉన్న వ్యక్తి కిందకు దిగి.. ఆర్టీసీ డ్రైవర్ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ రాడ్తో దాడికి యత్నించాడు. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో నుంచి సదరు ఆగంతకుడి ఫొటోను పోలీసులు సేకరించారు. అతడి ఆచూకీ కోసం సోమవారం పత్రికా ప్రకటన విడుదలజేశారు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి వివరాలు తెలిస్తే 9490616554, 9490616351 నంబర్లకు కాల్ చేసి చెప్పాలని కోరారు.