సిటీబ్యూరో, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నగరంలో దేశభక్తి గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
మంగళవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సోమాజిగూడ పార్కు హోటల్లో నిర్వహిస్తామని తెలిపారు. గాయని వాణీరావు దేశ భక్తి గీతాలను ఆలపిస్తారని, గజల్స్ను సైతం పాడతారని తెలిపారు. ఈ ప్రదర్శన పూర్తిగా ఉచితంగా ఉంటుందని, ఆసక్తి ఉన్నవారు ఎవరైనా హాజరు కావొచ్చని సూచించారు.
రిచర్డ్ అటెన్బరో రూపొందించిన గాంధీ చిత్ర ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 552 థియేటర్లలో ప్రదర్శిస్తున్నామని అర్వింద్ కుమార్ ట్వీట్ చేశారు. తెలుగు, హిందీ భాషల్లో ఉన్న ఈ సినిమాను ఆగస్టు 9వ తేదీ నుంచి 22 వరకు ఉచితంగానే ప్రదర్శించనున్నారు. సుమారు 22 లక్షల పాఠశాల విద్యార్థులు ఈ సినిమాను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు.
సిటీబ్యూరో, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో మంగళవారం ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతలను ఆర్డీవో, తహసీల్దార్లు, డీఈవో, డీపీఆర్వోలతో పాటు ఇతర జిల్లా అధికారులకు అప్పగించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.