గ్రేటర్ హైదరాబాద్లో నాలా పూడికతీత పనులు, నాలా విస్తరణ , ఆక్రమణల తొలగింపు పనులను మరింత ముమ్మరంగా చేపట్టేందుకుగానూ ప్రతి జోన్కి ప్రత్యేకంగా ఒక చీఫ్ ఇంజినీర్ను పర్యవేక్షణ అధికారిని నియమిస్తున్నట్టు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలపై పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఉప మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, జీహెచ్ఎంసీ, జలమండలి తదితర విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు నాలుగు గంటలు ఈ సమావేశం జరిగింది. సాధ్యమైనంత అదనపు యంత్రాలు, మానవ వనరులను ఉపయోగించి పూడిక పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. పూడికతీత పనులు అత్యంత ప్రాధాన్యత గల పనుల్లో చేరుస్తూ వీటి పనులకుగానూ నిధులను విడుదల చేసేందుకు ప్రత్యేకంగా గ్రీన్ చానెల్ను కూడా ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. నగర అభివృద్ధి, సామాన్య ప్రజానీకం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నాలాల ఆక్రమణలను, అడ్డంకుల తొలగింపు పనులను సంబంధించి ప్రభుత్వమే నిధులు పూర్తిగా మంజూరు చేస్తుందని కేటీఆర్ చెప్పారు. ఈ విషయంలో స్వల్పకాలిక పనులను పరిపాలన సంబంధిత అనుమతులను మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాల కల్పన, వినూత్న కార్యక్రమాల అమలులో హైదరాబాద్ నగరం దేశంలోని ఇతర నగరాలకన్నా ముందంజలో ఉందని, ఇందులో భాగంగానే ఎస్ఆర్డీపీ కార్యక్రమంలో చేపట్టిన దాదాపు 21 ప్రాజెక్టులు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయని కేటీఆర్ అన్నారు. మరో 17 ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తి కానున్నాయని మంత్రి పేర్కొన్నారు. నగరంలోని చెరువులను సుందరంగా అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కేటీఆర్ కోరారు. హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడే మరిన్ని వినూత్న కార్యక్రమాలను రూపొందించాలని అధికారులకు కేటీఆర్ సూచించారు.
గ్రేటర్లో పారిశుధ్యం, టాయిలెట్ల నిర్వహణ తీరు పట్ల జోనల్ కమిషనర్లపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై మరింత శ్రద్ధ చూపించాలని, ఈ విషయంలో జోనల్ కమిషనర్లు ప్రతి రోజూ ఉదయం వేళలో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. సర్కిళ్ల వారీగా శానిటేషన్ కార్యక్రమాలపై ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సర్కిల్లో ఎన్ని నివాసాలున్నాయి? శానిటేషన్ స్టాఫ్ ఎంత మంది ఉన్నారు? ఇంటింటి నుంచి చెత్త సేకరణకు ఎన్ని స్వచ్ఛ ఆటోలున్నాయి? ఆదనంగా ఎన్ని కావాలి? తదితర అంశాలపై ఈ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. నగర పౌరుల సదుపాయాలకై ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు.
నగరంలో లింకు రోడ్ల నిర్మాణం, సీఆర్ఎంపీ పనుల పురోగతి ముమ్మరంగా సాగుతున్నాయని అధికారులు కేటీఆర్కు వివరించారు. వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ కోసం రూ. 2800కోట్ల విలువైన టీడీఆర్లను అందజేయడంతో దేశంలో మరే నగరంలో జరుగలేదని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఈ విషయమై కమిషనర్ లోకేశ్కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు.