సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) :‘మిలాద్-ఉన్-నబీ’ ర్యాలీ ఆదివారం నిర్వహించనున్న సందర్భంగా నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ తెలిపారు. శనివారం మిలాద్-ఉన్-నబీ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై అన్ని జోనల్ పరిధిలోని సెక్టార్ ఎస్ఐలతో పాటు ఉన్నతస్థాయి అధికారులతో సీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ ఆనంద్ పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ర్యాలీ నిర్వహించే మార్గాల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండు రోజుల కిందట శాంతియుత వాతావరణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గణేశ్ నిమజ్జనం కార్యక్రమంలో పోలీసులు సక్సెస్ అయ్యారని, అదే స్ఫూర్తితో మిలాద్-ఉన్-నబీ ర్యాలీలను కూడా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు కృషిచేయాలన్నారు. ర్యాలీలు నిర్వహించే నిర్వాహకులతో సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ర్యాలీ తీసే మార్గాలను ముందుగానే తెలుసుకొని, ఆ మార్గాల్లో సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వెళ్లే యువత పట్ల ట్రాఫిక్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు భద్రతను పాటించేలా, ప్రమాదాలు జరగకుండా వారికి సూచనలు చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఏడు జోన్లలో రెండుకంటే ఎక్కువ ర్యాలీలు
మిలాద్-ఉన్-నబీ ఉత్సవాల చారిత్రక ప్రాధాన్యత, దానికి సంబంధిత సమావేశాలు, వార్షిక ఆచారాలపై నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొత్త ఎస్హెచ్ఓలు, డీసీపీలకు సమగ్ర సమాచారాన్ని అందించాలని దక్షిణ మండలం డీసీపీని సీపీ ఆదేశించారు. ఈ సందర్భంగా అన్ని జోన్ల డీసీపీలు తమ జోన్ల పరిధిలో తీసే ర్యాలీల వివరాలను సీపీకి వివరించారు. సౌత్, సౌత్-ఈస్ట్, సౌత్-వెస్ట్ తదితర 7జోన్లలో గరిష్ఠంగా రెండు కంటే ఎక్కువ సంఖ్యలో ర్యాలీలు తీస్తున్నారని వివరించారు.
గుల్జార్హౌజ్ నుంచి ప్రధాన ఊరేగింపు మొదలు
పాతబస్తీలోని గుల్జార్హౌజ్ నుంచి ప్రధాన ఊరేగింపు మొదలై పత్తర్ఘట్టి, మదినా క్రాస్రోడ్, చత్తబజార్, పురాని హవేలి, మిరాలం మండి, ఇత్తెబర్ చౌక్, కోట్ల అలిజ తదితర ప్రాంతాల మీదుగా సాగుతూ మొగల్పురాకు చేరుకుంటుందని డీసీపీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. అనంతరం అదనపు సీపీ(శాంతి భద్రతలు) విక్రమ్సింగ్ మాన్, అదనపు సీపీ(ఎస్బీ) విశ్వప్రసాద్లు గతంలో జరిగిన ఘటనలపై చర్చించారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన ముందుజాగ్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించడం, నేర చరిత్ర కలిగిన రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టడం, సోషల్ మీడియాపై నిఘా పెట్టడం తదితర భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను సూక్ష్మంగా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.