చార్మినార్, సెప్టెంబర్ 23 : మర్కజీ జులూస్ (ముస్లిం మత పెద్దలు) నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం గొప్పదని నగర సీపీ సీవీ ఆనంద్ అభిప్రాయపడ్డారు. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న చర్చల అనంతరం ముస్లిం మత పెద్దలు ఊరేగింపును వాయిదా వేసుకొని, అక్టోబర్1న నిర్వహించుకుంటామని ముందుకు రావడం హర్షణీయమన్నారు. శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు ముగిసేలా ప్రతి ఒక్కరూ పరస్పరం సహాకరించుకోవాలని సీపీ సూచించారు. శనివారం పాత నగరంలోని దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం ఆయన పలు అంశాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పర్వదినాలు ఒకేసారి రావడంతో అన్ని వర్గాల చూపు నగరంపై పడిందన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినం ఊరేగింపును అక్టోబర్1వ తేదీన నిర్వహించుకుంటామని మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు కమిటీ తమ అభిప్రాయం వ్యక్తం చేసిందని సీపీ తెలిపారు.
గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు సైతం ముస్లిం మత పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారని చెప్పారు. అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకెళ్తున్న తరుణంలో మరింత శ్రమిస్తూ ప్రశాంత వాతావరణానికి భంగం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని సీపీ పేర్కొన్నారు. పోలీసులు శాంతి భద్రతలను కాపాడేందుకు రాత్రి సమయంలో పెట్రోలింగ్ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. మండపాల వద్ద భద్రతతోపాటు నిమజ్జనం కోసం సాగే వినాయక మండపాలకు భద్రత కల్పిస్తున్నామని, రూట్మ్యాప్లను ఇప్పటికే సిద్ధం చేశామని సీపీ తెలిపారు. ట్యాంక్బండ్తోపాటు ఇతర చెరువుల వద్ద ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. జీహెచ్ఎంసీతోపాటు వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో కలిసి శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు ముగిసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు.ఈ సమావేశంలో దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్యతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
అక్టోబర్ 1న మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు
మిలాద్ ఉన్ నబీ పర్వదినం ఊరేగింపును అక్టోబర్1వ తేదీన నిర్వహించుకునేందుకు సమష్టి నిర్ణయం తీసుకున్నామని ముస్లిం మత పెద్దలు తెలిపారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినం నిర్వహణ విషయంలో వివిధ ఊరేగింపు కమిటీలతో సమావేశమై ఉమ్మడి నిర్ణయం తీసుకున్నామని వారు పేర్కొన్నారు. శనివారం దక్షిణ మండలం డీసీపీ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్తో పలువురు ముస్లిం మత పెద్దలు సమావేశమయ్యారు. అనంతరం పలువురు మత పెద్దలు మాట్లాడుతూ… హైదరాబాద్ మత సామరస్యానికి ప్రత్యేక అని, శాంతియుత వాతావరణానికి ఎక్కడ భంగం కలుగకుండా ఇరు వర్గాల పండుగలు సామరస్యపూర్వకంగా కొనసాగడానికి నిర్ణయించామని తెలిపారు. గణేశ్ నిమజ్జనం సామూహిక ఊరేగింపు జరిగే రోజున ముస్లింల పర్వదినమైన మిలాద్ ఉన్ నబీ రావడంతో ముస్లిం మత పెద్దలు పోలీసులతో కలిసి మత సామరస్యాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చామని పేర్కొన్నారు. గణేశ్ నిమజ్జనం సామూహిక ఊరేగింపు ప్రశాంతంగా కొనసాగడానికి తమవంతు సహకారం అందిస్తామన్నారు.