ఆ జంటకు పెళ్లయి ఆరేళ్లయింది. ఎన్ని రకాల మందులు తీసుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు మాత్రం పుట్టలేదు. దానికితోడు శారీరకంగా కలిసిన ప్రతిసారీ ఆ భార్యకు ఒళ్లంతా దురదలు, దద్దుర్లు, జ్వరం, దగ్గు వస్తున్నాయి. దీంతో తమ సమస్య ఏంటో తెలుసుకునేందుకు ఆ జంట ఆస్పత్రికి వెళ్లింది.
ఈ జంటకు కొన్ని పరీక్షలు చేసిన తర్వాత.. సదరు భార్యకు భర్త వీర్యం పడటం లేదని, దాని వల్లనే ఎలర్జీ వస్తోందని డాక్టర్లు గుర్తించారు. ఇలాంటి కేసులు ప్రపంచంలో పలుచోట్ల వెలుగు చూసినప్పటికీ.. హైదరాబాద్లో ఇదే తొలికేసని డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలిపారు. సదరు జంటకు చేసిన టెస్టుల్లో భార్యకు సీమెన్ హైపర్సెన్సిటివిటీ రియాక్షన్ ఉన్నట్లు తేలిందని డాక్టర్ వెల్లడించారు.
ఆమెకు కలుగుతున్న దురదలు, దద్దుర్లు అన్నింటికీ భర్త వీర్యమే కారణమని తేలింది. ఈ ప్రయోగంలో భాగంగా సదరు మహిళ చేతిని స్టెరిలైజ్ చేసి, నొప్పి తెలియకుండా చేసే చర్మ పరీక్షకు తీసుకెళ్లారు. దీనిలో భాగంగా భర్త నుంచి సేకరించిన 0.5 మిల్లీలీటర్ల వీర్యాన్ని ఆమె చర్మంపై ఉంచగా ఎలర్జిక్ రియాక్షన్ కనిపించింది. దీంతో ఆమెకు సీమెన్ ఎలర్జీ లేదా హైపర్సెన్సిటివిటీ సమస్య ఉందని వైద్యులు నిర్ధారణకు వచ్చారు.
ఈ ఎలర్జీని పట్టించుకోకపోతే చాలా సమస్య అని, ఈ సమస్య ప్రాణాంతకమైన ఎలర్జిక్ అనాఫైలాక్టిక్ షాక్కు దారి తీయవచ్చని వైద్యులు తెలిపారు. శృంగారం సమయంలో కండోమ్ వాడితే అంత సమస్య ఉండకపోవచ్చునని, అలాగే ఇన్ఫెర్టిలిటీ నిపుణుల సాయంతో పిల్లలను కనేందుకు ప్రయత్నించవచ్చని సూచించారు.