ఎలివేటెడ్ కారిడార్తో ఆస్తులను కోల్పోతున్న బాధితులకు హైదరాబాద్ కలెక్టరేట్లో చేదు అనుభవం ఎదురైంది. ‘మీరిక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. చెప్పేది వింటే చాలు. ఎదురు ప్రశ్నలు అడగొద్దు. మీ డిమాండ్లు, సూచనలు వినాల్సిన అవసరం మాకు లేదు. అవసరమైతే కోర్టులకు పరిహారం మొత్తం చెల్లించి, భూములు ఎలా సేకరించాలో తెలుసు. స్వచ్ఛందంగా సహకరిస్తే, ప్రశాంతంగా భూసేకరణ చేసుకుంటాం. లేదంటే మీ ఇష్టం. ఎంత అభ్యంతరం చెప్పినా ప్రయోజనం లేదు. పరిహారం విషయంలో ఇంకో మాటలేదు.” అంటూ కలెక్టర్ అల్టీమేటం జారీ చేశార’ని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
-సిటీబ్యూరో
హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వేదికగా కలెక్టర్ అధ్యక్షతన, భూసేకరణ యంత్రాంగం, బాధితులు, జేఏసీ నాయకులతో సమావేశం జరిగింది. తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని అధికారులకు వివరిస్తూ, న్యాయమైన పరిహారం కోసం మాట్లాడేందుకు రాజీవ్ రహదారి జేఏసీ నాయకులతోపాటు, పదుల సంఖ్యలో బాధితులు ఈ సమావేశానికి హాజరయ్యారు. తమ సమస్యలకు అధికారులు సానుకూల పరిష్కారం చూపుతారని ఆశగా వచ్చిన బాధితులకు, కలెక్టర్ దురుసు వైఖరితో తీవ్ర భంగపాటుతో వెనుదిరిగారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే కలెక్టర్ జేఏసీ నాయకులు, బాధితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా బాధితులు తెలిపారు. ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదన్న అసహనంతో కలెక్టర్ బాధితులపై మండిపడ్డారని జేఏసీ నాయకులు వివరించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడిన తీరుపై జేఏసీ నాయకులు ‘నమస్తే తెలంగాణ’కు వివరిస్తూ.. కలెక్టర్ తమను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారన్నారు.
దాదాపు 50 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో బాధితుల వాదనలను వినే వారు లేరనీ జేఏసీ నాయకులు వాపోయారు. తాము ఎందుకు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని విషయాన్ని మరిచి… పరిహారం విషయంలో సర్కారు ఆడుతున్న దోబూచులాటతో ప్రాజెక్టుకు సహకరించడం లేదన్నారు. కానీ అధికారులు తమకు అన్యాయం చేసేలా, పరిహారం పెంచకుండానే భూసేకరణ చేయాలని అధికారులు చూస్తున్నారని బాధితులు పేర్కొన్నారు. ఏకపక్షంగా సాగుతున్న నిర్ణయాలతో తమకు నష్టమే తప్పా.. ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఈ సమావేశంతోనే తేలిపోయిందనీ, ఎలివేటెడ్ ప్రాజెక్టు పేరిట తమ ఆస్తులను నిర్వీర్యం చేసి ప్రభుత్వం రోడ్డున పడేలా వ్యవహారిస్తుందని మండిపడ్డారు.
పరిహారంలో వ్యత్యాసం ఎందుకు? : బాధితులు
జేబీఎస్ నుంచి తూంకుంట వరకు విస్తరించి ఉన్న ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో హైదరాబాద్, మేడ్చల్ జిల్లా పరిధిలో ఉంది. ఇక్కడ పరిహారంలో అధికారులు విభిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఒక్క ప్రాజెక్టు, వేర్వేరు పరిహార విధానాలను అవలంభించడం సరికాదు.. మేడ్చల్ జిల్లా పరిధిలోని తూంకుంట ప్రాంతంలో అక్కడి మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం లెక్కించిన యంత్రాంగం… హైదరాబాద్ జిల్లా అధికారులు మాత్రం ఎస్ఆర్వో లెక్కన పరిహారాన్ని, అది కూడా టీడీఆర్ బాండ్ల రూపంలో ఇచ్చే కుట్రలు చేస్తున్నారు. స్థానికంగా బహిరంగ మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చే పరిహారంతో తమకు తీరని నష్టం జరుగుతుంది. ప్రస్తుతం సగటున గజానికి రూ. 1.5 లక్షల నుంచి 3 లక్షల మధ్య మార్కెట్ ధరలు ఉంటే… బహిరంగ మార్కెట్ ఆధారంగా ఎందుకు ఇవ్వడం లేదు.
అధికారుల తీరుతో తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం కోల్పోయాం. ఈ సమావేశంలో బాధితుల వాదనకు విలువే లేకుండా పోయింది. తూంకుంట ప్రాంతంలో ఏ నిష్పత్తి లెక్కన విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లాల్ బజార్, లోతుకుంట, బాధితులకు పరిహారం ఇవ్వాలి. ప్రస్తుతం నిర్ణయించిన పరిహారానికి ఒక్క రూపాయి పెంచడానికి వీల్లేదనీ కలెక్టర్ చెప్పడం సరికాదు. బాధితులందరూ ప్రాజెక్టును స్వాగతిస్తున్నారు కానీ పరిహారం విషయం తేల్చే వరకు సహకరించే ప్రసక్తే లేదు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం న్యాయపోరాటం కొనసాగుతుంది. పలు కోర్టుల పరిధిలో కేసులు తేలేంత వరకు ప్రాజెక్టుకు భూములు ఇచ్చే ఆలోచన లేదు.
-జేఏసీ ప్రెసిడెంట్ సతీశ్ కుమార్
రాష్ట్ర రహదారిపై చేపడుతున్న ప్రాజెక్టు కోసం భూ యజమానులకు పరిహారంపై అవగాహన కల్పించాం. ఇందులో భాగంగా బిల్డ్ నౌ వేదిక ద్వారా జారీ చేసే టీడీఆర్ బాండ్ల పనితీరు, పరిహారం లెక్కింపు, ఎస్ఆర్వో ధరలతో అనుసంధానమైన విధానం, టీడీఆర్ బాండ్ల వినియోగం, ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ, బదిలీ తదితర అంశాలను వివరించాం. అర్హత కలిగిన భూ యజమానులకు టీడీఆర్ ఐచ్చిక విధానంగా అమలు చేస్తాం. ప్రభావిత భూ యజమానులు ఈ విధానాన్ని స్పష్టంగా అర్ధం చేసుకోవాలి.
– కలెక్టర్ ప్రియాంక అల