సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): శివారుల్లో చైన్ స్నాచింగ్లు.. సిటీలో సెల్ఫోన్ స్నాచింగ్ల ముఠాలు చెలరేగిపోతున్నాయి. బంగారం ధరలు పెరగడం.. సెల్ఫోన్లను విదేశాలకు తరలిస్తున్న ముఠాలు అందుబాటులో ఉండటంతో స్నాచర్లు బరితెగిస్తున్నారు. అత్తాపూర్లో ఓ యువకుడు సెల్ఫోన్ స్నాచింగ్ను అడ్డుకునే ప్రయత్నం చేయగా నేరగాళ్లు అతడిని హత్య చేశారు.
అలాగే, ఇటీవల శివారు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న మహిళల మెడలోంచి బంగారు గొలుసులు లాక్కుని పారిపోతున్న దుండగులు.. బాధితులను గాయపరుస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. స్థానిక దొంగల ముఠాలతో పాటు అంతర్రాష్ట్ర ముఠాలు రెచ్చిపోతున్నాయి. తాజాగా, 31 మందితో కూడిన సెల్ఫోన్ స్నాచింగ్ ముఠాను సిటీ పోలీసులు అరెస్టు చేశారు.
పదేండ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో చైన్ స్నాచింగ్లు ప్రతి రోజు జరిగాయి. నేరగాళ్లకు చిక్కకుండా ఉండాలంటే.. మహిళలు మెడపై కొంగు వేసుకొని నడవాలని స్వయంగా పోలీసులే సూచించారు. మీ జాగ్రత్తలే మీకు శ్రీరామ రక్ష అని చెప్పారు. ప్రతి రోజు నగరంలో 1 నుంచి 10 స్నాచింగ్ ఘటనలు నమోదయ్యాయి. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వ్యవస్థీకృత నేరాలను అదుపు చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి, కార్యాచరణ చేపట్టింది.
దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో నేరగాళ్లను ఉక్కుపాదంతో అణిచివేసింది. ఇతర రాష్ర్టాల ముఠాలు నగరం వైపు చూడకుండా చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. స్నాచర్లు తిరిగి హల్చల్ చేస్తున్నారు. ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన స్నాచింగ్ ముఠాల్లో చాలా మంది పాత నేరస్తులే ఉన్నారు. గతంలో ప్రతి స్నాచర్కు హైదరాబాద్ పోలీసులంటే భయం ఉండేది. నేడు ఆ పరిస్థితి కనిపించడంలేదన్న విమర్శలు ఉన్నాయి.
హైదరాబాద్లో రాత్రి వేళల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని, సెల్ఫోన్ స్నాచర్లతో ప్రమాదం పొంచి ఉంటుందని స్వయంగా నగర పోలీసు కమిషనర్ సూచించడం.. స్నాచింగ్ ఘటనల తీవ్రతకు అద్దం పడుతోంది. సెల్ఫోన్ స్నాచింగ్ ఘటనలు వ్యవస్థీకృత నేరాలుగా మారాయంటూ అధికారులే చెబుతున్నారు. స్థానిక సెల్ఫోన్ స్నాచింగ్ ముఠాలు కొన్ని అంతర్జాతీయ సెల్ఫోన్ దొంగల ముఠాలతో చేతులు కలిపి, అంతర్జాతీయంగా సెల్ఫోన్లను విక్రయిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే రెండు ముఠాలను పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు 1413 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
శివారుల్లో ఒంటరిగా వెళ్లే మహిళలను స్నాచర్లు వదలడం లేదు. వెంటాడి మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కొని పారిపోతున్నారు. ఇటీవల రాచకొండలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో వరుస స్నాచింగ్లు జరిగాయి. చైన్ స్నాచింగ్లు, సెల్ఫోన్ స్నాచింగ్లతో హడలెత్తిస్తున్న నేరగాళ్లను కట్టడి చేయాల్సిన పోలీసులు.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పెట్రోలింగ్ వ్యవస్థలోని లోపాలే స్నాచర్లకు కలిసి వస్తున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. నగరంలో యాంటీ స్నాచింగ్ టీమ్లు ఏర్పాటు చేసినా.. వాటితో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నారు. నగరంలో విజుబుల్ పోలీసింగ్తో కూడిన పెట్రోలింగ్ ఉంటే కొంతనైనా కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని ప్రజలు సూచిస్తున్నారు.