మురికివాడల స్థానంలో అందమైన భవంతులు.. ఇంటింటికీ స్వచ్ఛమైన నీటి సరఫరా…అద్దంలా మెరిసిపోతున్న రోడ్లు.. అండర్పాస్లు, ఫ్లైఓవర్లు, ఆర్వోబీలు, ఆర్యూబీలు, లింక్రోడ్లు..ఏ రోజు చెత్త ఆ రోజే తరలింపు.. ట్రాఫిక్ సమస్య నివారణకు అదనపు సిగ్నళ్లు, యూటర్న్లు.. నిరంతరాయంగా కరెంటు..పరిశ్రమలకు పవర్ హాలిడేలు లేవు. పచ్చదనం పెంపునకు
ఉద్యానవనాలు..రూ.5కే అన్నపూర్ణ భోజనం..ఉగ్గబట్టుకోకుండా అడుగడుగునా టాయిలెట్స్ ఏర్పాటు.. రాకపోకలను సులభం చేసిన మెట్రో.. ఇలా చెబుతూ పోతే స్వరాష్ర్టంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. ఏడేండ్లలో నగరాభివృద్ధికి వేల కోట్లు వెచ్చించిన ప్రభుత్వం హైదరాబాద్పై చూపిస్తున్న శ్రద్ధకు తార్కాణం. రూ.50వేల కోట్ల వ్యయంతో భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే బృహత్ కార్యాన్ని నెరవేర్చుతున్నది టీఆర్ఎస్ సర్కారు. సమైక్య సంకెళ్లను తెంచుకొని సగౌరవంగా పాలన సాగిస్తూ నేడు ఏడో వసంతంలోకి అడుగిడుతున్నది. ఈ సందర్భంగా నగరాభివృద్ధిపై ప్రత్యేక కథనం..
అభివృద్ధి చెందేలా విస్తరణ పాలసీ అమలు చేస్తున్నాం. అందుకే కొత్తగా వస్తున్న ఐటీ కంపెనీలను కేవలంపశ్చిమాన కాకుండా నగరం నలుమూలలా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. లైఫ్ సైన్సెస్ లో కూడా హైదరాబాద్ దూసుకుపోతున్నది. లక్షలాది మందికి కొత్త ఉపాధి కల్పించే విధంగా ఫార్మా రంగవిస్తరణలో భాగంగా వేగంగా ఫార్మాసిటీ పనులు నడుస్తున్నాయి’
‘టాప్ 5 మోస్ట్ వాల్యూడ్ టెక్నాలజీ కంపెనీలు మైక్రోసాఫ్ట్, గూగుల్, అమేజాన్, ఫేస్బుక్, యాపిల్.. మన వద్దే ఉన్నాయి. వీటిలో మైక్రోసాఫ్ట్ మాత్రమే 2000 సంవత్సరంలో వచ్చింది. కానీ మిగతా ఆ నాలుగు కంపెనీలు తెలంగాణ ఏర్పాటైన తర్వాతే ఇక్కడికి వచ్చాయి. వాళ్ల సెకండ్ లార్జెస్ట్ కంపెనీలు హైదరాబాద్లోనే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్లకు బెంగళూరు, చన్నై, ముంబై, ఢిల్లీల్లో కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నా.. హైదరాబాద్లో ఉన్న వాతావరణం, శాంతిభద్రతలు, ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై వచ్చారు’
‘ఉపాధి కోరేవారు కాకుండా..ఉపాధి సృష్టికర్తలు కావాలి. ఈ నినాదంతో ఇన్నొవేషన్కు పెద్దపీట వేశాం. అందుకే టీ హబ్, వీ హబ్, టీ వర్క్స్ ఏర్పాటు చేశాం. కేవలం మహిళల కోసమే ఎంటర్ప్రెన్యూర్ హబ్ భారతదేశంలో ఎక్కడా లేదు. కేవలం మన హైదరాబాద్లో మాత్రమే ఉంది. అత్యధిక కోవర్క్ స్టేషన్లు, అత్యధిక ఇంక్యుబేటర్లు కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి’
‘త్వరలోనే మనం ఆవిష్కరించుకోబోతున్న పోలీస్ టవర్స్ బిల్డింగ్ ఏదో ఆషామాషీగా, అందమైన బిల్డింగ్ కట్టాలని నిర్మించలేదు. ఈ నగరం, ఈ రాష్ట్రం అత్యంత సురక్షితంగా, భద్రంగా ఉండాలన్న ఉద్దేశంతో 2015 లో ఆరుగురు సీనియర్ పోలీస్ అధికారులు స్కాట్లాండ్, లాస్ ఏంజెలిస్ వెళ్లి అక్కడ పోలీస్ వ్యవస్థను అధ్యయనం చేశారు. దాని ఆధారంగా హైదరాబాద్ లాంటి గ్లోబల్ సిటీలో శాంతిభద్రల వ్యవస్థ ఎలా ఉండాలో ఒక నమూనాను ఆవిష్కరించి పోలీస్ టవర్స్కు శ్రీకారం చుట్టారు’
గతంలో మంచినీళ్ల కోసం కొట్లాటలు జరిగేవి. ట్యాంకర్ వచ్చిందంటే గొడవలు. నిత్యం జలమండలి కార్యాలయం ఎదుట ఆందోళనలు. ఇప్పుడా పరిస్థితి లేదు. మండుటెండల్లోనూ సరిపడా నీళ్లు అందిస్తూ నగరవాసుల నీటి కష్టాలను తీర్చుతున్నది. ఔటర్ లోపల గ్రామాల వరకు సేవల పరిధిని పెంచుకొని ఇంటింటికీ నల్లా ద్వారా సమృద్ధిగా నీటినందిస్తున్నారు. రూ.1670 కోట్లతో కృష్ణా మూడో దశ, రూ. 3800కోట్లతో గోదావరి జలాల తొలి విడత పథకం, శివారు 12 మున్సిపాలిటీలలో రూ. 1900కోట్లు, ఔటర్ లోపల 190 గ్రామాల్లో ఇంటింటి నీటి సరఫరా పథకానికి రూ.750 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులను చేపట్టి దాహార్తిని దూరం చేశారు.
నాడు కబ్జాలు, మురికికూపాలకు నిలయంగా మారిన చెరువులు నేడు కళకళలాడుతున్నాయి. అర్భన్ మిషన్ కాకతీయలో భాగంగా ప్రభుత్వం తొలివిడతగా 40 చెరువుల అభివృద్ధి, సుందరీకరణ చేపట్టి పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దింది. జీహెచ్ఎంసీ లోపల 20, ఔటర్ అవతల హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 20 చెరువులను సుందరీకరించారు. ప్రధానంగా చెరువుల్లో ఆక్రమణలను తొలగించడం, భవిష్యత్తులో కబ్జాలకు ఆస్కారం లేకుండా ఫెన్సింగ్ వేయడం, మురుగునీటి మళ్లింపు చర్యలు చేపట్టి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీటిని చెరువులోకి మళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. చెరువుకట్టలను బలోపేతం చేయడం, పూడికతీత చేపట్టారు. గ్రీనరీ పెంచడం, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్లాదం, ఆనందాన్నిచ్చే పూల మొక్కలు, వాకర్స్, పర్యాటకులు కూర్చునేందుకు బెంచీలు తదితర పనులు చేపట్టారు.
ట్రాఫిక్ చిక్కులను శాశ్వతంగా తొలగించేందుకు జంక్షన్ల సుందరీకరణ చేపట్టారు. నగరంలో 16 ప్రధాన జంక్షన్లను అభివృద్ధి చేశారు. అశోక్నగర్ జంక్షన్, పురానాపూల్, రాజీవ్గాంధీ విగ్రహం జంక్షన్, రామంతాపూర్ టీ జంక్షన్, కవాడిగూడ, ఖానామెట్ జంక్షన్, సుచిత్ర, ఐడీపీఎల్, లిబర్టీ, ఐ మాక్స్, నేరేడ్మెట్, మియాపూర్, ఎల్బీనగర్, ఏఎస్రావు నగర్, ఉప్పల్, అలీకేఫ్, ప్రాగాటూల్స్, బోరబండ బస్టాప్ జంక్షన్లను అభివృద్ధి చేశారు.
వనాలతోనే ఆహ్లాదమని నమ్మిన సర్కారు నగరంలో పచ్చదనం పెంపునకు పక్కా చర్యలు తీసుకున్నది. హరితహారంలో భాగంగా ఇప్పటివరకు 2,76,97,967 మొక్కలు నాటారు. మూడు కోట్ల మొక్కలు నాటే లక్ష్యం కాగా, 86.28 శాతం పూర్తి చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2.08 కోట్ల మొక్కల పంపిణీతోపాటు నాటారు. 65 ప్రాంతాల్లో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్, 19 మేజర్ పార్కులు, 17 థీమ్ పార్కులు, 919 కాలనీ పార్కులు, 105 సెంట్రల్ మీడియన్లు, 66 ట్రాఫిక్ ఐ -లాండ్లు, 327 ట్రీ పార్కులను ఏర్పాటు చేశారు.
మహానగరానికి మరో వన్నె తెచ్చే నిర్మాణం దుర్గం చెరువుపై తీగల వంతెన. రూ.187.50 కోట్లతో చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి పర్యాటకానికి మరో ప్రత్యేకార్షణ. 735.639 మీటర్ల పొడవు గల ఈ బ్రిడ్జి నిర్మాణంతో హైటెక్సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తోపాటు నగరంలోని ఇతర ప్రాంతాలకు సులభంగా రవాణా సౌకర్యం ఏర్పడింది. ప్రధానంగా మాదాపూర్ రోడ్, జూబ్లీహిల్స్ రోడ్ నం.36లలో ట్రాఫిక్ గణనీయంగా తగ్గింది.
హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి కలిగించేందుకు సుమారు రూ.25వేల కోట్లకు పైగా అంచనాలతో వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ) ప్రారంభించింది. ట్రాఫిక్ సమస్యకు శాశ్వతంగా చెక్పెట్టడంతో పాటు సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసింది. హైటెక్సిటీ, గచ్చిబౌలి, మెహిదీపట్నం, మాదాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఉప్పల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ వెతలు తీరాయి. కొత్తగా ఫ్లై ఓవర్లు, అండర్పాస్లతో భారీ ఉపశమనం లభించింది.
మొదటి దశలో 26 ప్రధానమార్గాలను విస్తరించి ఆయా మార్గాల్లో మల్టీలెవల్ ఫ్లైఓవర్లు, ప్రధాన జంక్షన్లను అభివృద్ధి చేసి సిగ్నల్ ఫ్రీకి బాటలు వేశారు. ఏడు స్కైవేలు, 11 మేజర్ కారిడార్లు, 68 మేజర్ రోడ్లు, 54 గ్రేడ్ సపరేటర్లను చేపట్టింది. రూ.1010.77కోట్లతో 9 ఫ్లైఓవర్లు, నాలుగు అండర్పాస్లు, మూడు ఆర్వోబీ/ఆర్యూబీ, ఒక కేబుల్ బ్రిడ్జి నిర్మాణాలను పూర్తి చేశారు. రూ. 4741.97 కోట్లతో మరో 20 అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.2310 కోట్ల వ్యయంతో ఐదు ప్రాజెక్టుల డీపీఆర్లు సిద్ధంగా ఉన్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో పారిశుధ్య కార్మికుల వేతనం.రూ.8500. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వారి శ్రమను గుర్తించి ఇప్పటివరకు మూడుసార్లు జీతాలు పెంచగా.. రూ.17,500లకు చేరింది. వారికి కావాల్సిన సామగ్రి, మౌలిక సమస్యలు తీర్చారు. నగరంలో దాదాపు 24వేల మంది కార్మికుల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపింది. ప్రమాదవశాత్తు పారిశుధ్య కార్మికుడు మరణిస్తే రూ.6 లక్షలు, శాశ్వతంగా వైకల్యం చెందితే రూ.3 లక్షలు, సాధారణ మరణం చెందితే రూ.3 లక్షలు అందిస్తున్నారు.
హైదరాబాద్ బ్రాండ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో రహదారుల పాత్ర గణనీయం. ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులు అని తేడా లేకుండా సాఫీ ప్రయాణమే లక్ష్యంగా రహదారుల అభివృద్ధికి ఏటా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) కింద సుమారు రూ.1839 కోట్లతో 709.49 కిలోమీటర్ల మేర నిర్వహణ పనులు చేపట్టి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. సీఆర్ఎంపీ తొలివిడత పనులు పూర్తిచేయగా, రెండోవిడత యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. బీటీ రోడ్లు త్వరగా పాడవుతుండటంతో వీడీసీసీ (వ్యాక్యూమ్ డీవాటర్డ్ సిమెంట్ కాంక్రీట్) రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్వ్యాప్తంగా రహదారుల పొడవు 9013 కిలోమీటర్లు కాగా, 2846 కిలోమీటర్లు మేర బీటీ రోడ్లు, 6167 కిలోమీటర్లు సీసీ రోడ్లు ఉన్నాయి.
ప్రభుత్వ వైద్య సేవలను విస్తృతం చేసింది. బస్తీ దవాఖానలు 225కు పైగా పనిచేస్తుండగా, ప్రతి బస్తీ దవాఖానలో సుమారు 80 నుంచి 90 మంది ప్రాథమిక చికిత్స చేయించుకుంటున్నారు. ఈ దవాఖానలో ఓపీ సౌకర్యం, టెలీ కన్సల్టేషన్, మౌలిక ల్యాబ్ పరీక్షలు, ఉచిత మందుల సరఫరా, ఇమ్యునైజేషన్ తదితర వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.
పారిశుధ్య నిర్వహణలో అద్భుత ఫలితాలను సాధించింది. పాత పద్ధతులకు స్వస్తి పలికి ఇంటింటికి రెండు చెత్త బుట్టలు పంపిణీ చేసి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరణ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 17 ట్రాన్స్ఫర్ స్టేషన్లు ఉండగా, ప్రతిరోజు 5600 నుంచి 6 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వస్తున్నాయి. వీటిని 2500 స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి నుంచి సేకరించడం, వాణిజ్య సముదాయాలు, రహదారులలో వచ్చే చెత్తను ముందుగా ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్లకు పంపిస్తున్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటం గమనార్హం. బహిరంగ మలమూత్ర విసర్జన లేని నగరంగా తీర్చిదిద్దేందుకుగానూ కొత్తగా 8,400 సీటింగ్ ఉండే విధంగా 4, 225 టాయిలెట్లను ఏర్పాటు చేశారు. 2016 నుంచి వరుసగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను సాధించింది. ఓడీఎఫ్ ++ సిటీగా వరుసగా రెండుసార్లు గుర్తింపు పొందింది.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క పైసా ఆస్తిపన్ను, విద్యుత్ బిల్లు, నీటి బిల్లు పెంచలేదు. అంతేకాదు రూపాయికే నల్లా కనెక్షన్, రూ.1200లోపు ఆస్తిపన్ను ఉన్న వారికి ఊరటనిస్తూ ఆస్తిపన్నును కేవలం రూ.101కి తగ్గించారు. బల్దియా ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉచిత తాగునీటి సరఫరా పథకం ప్రారంభమైంది.