Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూలో కల్తీ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని వేసిన ఓ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. దీనికోసం నవంబర్ 22న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
జనవరిలో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సమయంలో తిరుమల నుంచి పంపించిన లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది ఇమ్మనేని రామారావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ ఆరోపణలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తన పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే తిరుమల లడ్డూ కల్తీపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా, యూట్యూబ్ నుంచి తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు.
న్యాయవాది ఇమ్మనేని రామారావు వేసిన పిటిషన్పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సోమవారం నాడు విచారణ చేపట్టింది. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఇందుకోసం నవంబర్ 22న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. పవన్ కల్యాణ్తో పాటు తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి కూడా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.