Namasthe Telangana | సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలో భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ప్రధానంగా బహుళ అంతస్తులకు అనుమతులను పూర్తిగా నిలిపివేయడంతో బిల్డర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారం రోజుల కిందట‘ నిర్మాణ రంగం కుదేల్- ప్రభుత్వం మారగానే నిలిచిన బడా నిర్మాణాల అనుమతులు’ అనే శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన వార్తా కథనానికి సర్కారు స్పందించింది. ఎకరంలోపు ఉన్న స్థలంలో బహుళ అంతస్తులను నిర్మించేందుకు వచ్చిన అనుమతులను మంజూరుకు చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలో ఎక్కువగా భవన నిర్మాణాలు జరిగే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాల అనుమతులను ఆయా శాఖల అధికారులు పునరుద్ధరించారు. దేశ రియల్ రంగంలో హైదరాబాద్ ముందు వరుసలో ఉండేది. గత కేసీఆర్ ప్రభుత్వం స్వతరమే భవన నిర్మాణ అనుమతులను ఇచ్చేందుకు టీఎస్ బీ పాస్ను తీసుకొచ్చింది.
ఈ పాలసీతో ఎంతో పారదర్శకంగా, వేగంగా నిర్మాణ అనుమతులు వచ్చేవి. డిసెంబర్ నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు రావడంతోనే ఎంఎస్బీ కేటగిరీలో ఇచ్చే అనుమతులు మూడు నెలలుగా నిలిచిపోయాయి. దీంతో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న బిల్డర్లు ఎదురు చూస్తున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీల్లో ఉన్నతాధికారులు మారినా… ప్రభుత్వం ఆయా శాఖల్లోని కీలక అంశాలపై సమీక్షలు చేసినా, భవన నిర్మాణం అనుమతుల విషయాన్ని పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలోనే ‘నమస్తే’ కథనానికి స్పందించి..సర్కారు అనుమతులను పునరుద్ధరించడంపై బిల్డర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.