ఎన్నో ప్రత్యేకతలతో అలరారుతున్న భాగ్యనగరం.. పచ్చదనంలోనూ విశిష్టతను చాటుకుంటున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో ఎటు చూసినా.. హరితసిరి కనువిందు చేస్తున్నది. ‘వరల్డ్ గ్రీన్ సిటీ’గా, ‘లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్’ వంటి ప్రపంచస్థాయి పురస్కారాలనూ భాగ్యనగరం దక్కించుకున్నది. ప్రభుత్వం రాష్ట్రంలో మొత్తం 109 ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేయగా, అందులో 21 హైదరాబాద్ చుట్టు పక్కలే ఉన్నాయి. ఈ పార్కులు నగరంలో కాలుష్యాన్ని తగ్గించి ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్ని కలిగించేలా తీర్చిదిద్దారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టడంతో పచ్చదనం గణనీయంగా పెరిగింది. ఈ అర్బన్ ఫారెస్ట్ పార్కులతో 33.15 చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ ప్రాంతం 81.81 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. మొత్తం 147 శాతం పెరుగుదల నమోదైందని, ఇదంతా నగరానికి 30 నుంచి 35 కి.మీ పరిధిలో ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు ఔటర్ సైతం పచ్చదనంలో మేటిగా నిలుస్తున్నది. ప్రయాణికులకు మధురానుభూతిని పంచుతున్నది.
-సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ)
విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చే చర్యల్లో భాగంగా హెచ్ఎండీఏ పరిధిలో 21 చోట్ల భాగ్యనగర నందనవనం తరహాలో అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లను అభివృద్ధి చేసింది. గ్రేటర్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, యాదాద్రి, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 5928.38 హెక్టార్లలో సుమారు రూ.96.64కోట్లతో 21 ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను తీర్చిదిద్దింది. నగరం నడిబొడ్డున కేబీఆర్ పార్కు తరహాలో ఇవి నగర ప్రజలకు అందుబాటులోకి రావడంతో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో వేలాది మంది పార్కుల్లో హాయిగా సేదతీరుతున్నారు. ఒకవైపు పట్టణీకరణతో పెరుగుతున్న కాలుష్య తీవ్రత..మరోవైపు ఉద్యోగాల ఒత్తిడి..వెరసి జీవన విధానాల్లో వస్తున్న మార్పులతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులు చక్కని వేదికలుగా మారాయి.
ఆహ్లాదానికి నిలయంగా మారిన అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకునే ప్రయాణికులు, నగరం నుంచి కుటుంబ సభ్యులతో ఈ పార్కుకు వెళ్లి సేద తీరేలా ఈ ఉద్యానవనాలను సిద్ధం చేశారు. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో నడక కోసం వాకింగ్ పాత్వేలను, సైక్లింగ్ కోసం సైకిల్ ట్రాక్లు, పిల్లలు ఆడుకునే విధంగా చిల్డ్రన్ కార్నర్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు యోగాసెంటర్లు, సందర్శకులు కూర్చునేందుకు భారీ వృక్షాల కింద రచ్చబండలను సైతం ఏర్పాటు చేశారు. వాష్రూమ్లు, గజేబో (గుడిసెలు)లు, సెక్యూరిటీ రూం, టికెట్ కౌంటర్ వంటివి సైతం ఉన్నాయి.
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు 158 కి.మీ పొడవునా నిరంతరం పచ్చదనం పరిడవిల్లడంతో మహానగరానికి గ్రీన్ నెక్లెస్గా మారింది. ఈ నేపథ్యంలోనే దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో ‘వరల్డ్ గ్రీన్ సిటీస్ అవార్డ్స్ 2022’ దక్కింది. తొమ్మిదేండ్లుగా ఔటర్ రింగు రోడ్డు చుట్టూ నాటిన మొక్కలు పెరిగి ఇప్పుడు దట్టమైన కొమ్మలతో ఏపుగా పెరిగాయి. దీంతో ఓఆర్ఆర్కు ఇరువైపులా ఖాళీ స్థలం కనిపించకుండా చెట్లు కనిపిస్తుండడంతో చిట్టడివిని తలిపిస్తున్నది. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపలి వైపు ప్రధాన రహదారిని ఆనుకొని రైల్వే కారిడార్ కోసం సేకరించిన ఉంచిన 25 మీటర్ల వెడల్పుతో కూడిన స్థలంలో ఖాళీ స్థలం కనిపించకుండా మొక్కలు నాటుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు ఔటర్ రింగు రోడ్డు చుట్టూ 7 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ఇప్పుడవన్నీ పూర్తి స్థాయిలో ఎదిగి పచ్చదనంతో నిండు అడవిని తలపిస్తున్నది. ఓఆర్ఆర్ చుట్టూ ఇంటర్చేంజ్లు ఉన్న కొన్ని చోట్ల 50 నుంచి 100 ఎకరాల వరకు భూములు హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్నాయి. దీంతో ఈ భూముల్లోనూ మొక్కలు నాటారు. కొన్ని ఇంటర్చేంజ్ల వద్ద నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
మహానగరానికి మణిహారంలా మారిన ఓఆర్ఆర్ పొడవునా నిత్యం పచ్చదనం ఉండేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అత్యాధునిక డ్రిప్ ఇరిగేషన్ సిస్టంను ఏర్పాటు చేసింది. 158 కి.మీ పొడవునా ఉన్న ఓఆర్ఆర్ చుట్టూ రకరకాల చెట్లు, పూల మొక్కలు నిరంతరం పచ్చదనంతో ఉండేందుకు ఆధునిక నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందుకోసం సుమారు రూ.42 కోట్లను వెచ్చించి ఈ ఏడాదిలోనే ఈ పనులన్నీ పూర్తి చేసి ఓఆర్ఆర్ చుట్టూ డ్రిప్ సిస్టింను అందుబాటులోకి తెచ్చారు. ఓఆర్ఆర్ సెంట్రల్ మీడియన్పై 3 వరసల్లో, ఇరువైపులా ఉండే సర్వీసు రోడ్ల పొడవునా 3 వరసల చొప్పున మొత్తం 9 వరసల్లో డ్రిప్ సిస్టింలో పైపులను ఏర్పాటు చేశారు. కాగా, ఓఆర్ఆర్ షూటింగ్లకు స్పాట్గా మారింది. చుట్టూ లొకేషన్లు బాగా ఉండడంతో సినిమాలు, టీవీ సీరియల్స్, వెబ్ సీరిస్ల షూటింగ్లను ఓఆర్ఆర్ మంచి స్పాట్గా ఎంచుకుంటున్నారు. షార్ట్ఫిల్మీలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
హెచ్ఎండీఏ పరిధిలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో 4.86 కోట్లు, హెచ్ఎండీఏ పరిధిలో 3.21 కోట్ల చొప్పున మొత్తం 8.07 కోట్ల మొక్కలను నాటారు. మొక్కలను పెంచి, ఏటా వర్షా కాలం ప్రారంభంలో నాటేందుకు నగరం నలుమూలలా 34 నర్సరీలను హెచ్ఎండీఏ నిర్వహిస్తున్నది. ఇందులో 100కు పైగా వివిధ జాతుల మొక్కలను పెంచుతున్నారు. ప్రధానంగా రాగి, మర్రి, గుల్ మొహర్, నెమలి నార, నందివర్ధనం, పొగడ, పర్కియా, జామ, ఈత, వేప, బాదం, కానుగ, గన్నేరు, చింత, బోగన్విల్లా, పాపయా, పెల్టోఫామ్, దేవ గన్నేరు, నేరేడు, బాంబూ, మిల్లి, గ్రీన్ ఫండా,మద్ది, వెలగ, సంపంగి, మందారం ఇలా వివిధ జాతులకు చెందిన మొక్కలను పెంచుతూ.. ప్రభుత్వ సంస్థలకు, స్థానిక ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తూ పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నది.
హైదరాబాద్ మహానగరానికి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వరించింది. లివింగ్ గ్రీన్ కేటగిరీ కింద.. ఓఆర్ఆర్(ఔటర్ రింగ్ రోడ్డు) చుట్టూ ఉన్న గ్రీనరీకి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు లభించింది. నగరానికి వరల్డ్ సిటీ గ్రీన్ అవార్డును ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చరల్ ప్రొడ్యూసర్స్ (ఏఐపీహెచ్) ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. భారత్ నుంచి ఈ పురసారం అందుకున్న ఒకే ఒక సిటీ మన హైదరాబాద్ నగరం కావడం గమనార్హం. దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ కార్యక్రమాన్ని నిర్వహించగా, గ్రాండ్ విన్నర్గా హైదరాబాద్కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్-2022ను ప్రదానం చేయగా, మరో విభాగమైన లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్ క్లూజివ్ గ్రోత్లో మరో అవార్డును దక్కింది. తెలంగాణ రాష్ర్టానికి గ్రీన్ నెక్లెస్గా పిలిచే ఓఆర్ఆర్ చుట్టూ పచ్చదనం ఈ విభాగంలో ఉత్తమమైందిగా ఎంపికైంది.