సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): బీహార్లో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులపై కాల్పులు జరిపి, పరారైన నిందితుడు మిథిలేశ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు బృందాలను రంగంలోకి దింపినట్లు సైబర్క్రైం ఏసీపీ శ్రీధర్ తెలిపారు.
ఆదివారం దుండగుడు జరిపిన కాల్పుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్న సైబరాబాద్ పోలీసులు క్షేమంగానే ఉన్నారని, సోమవారం రాత్రి వరకు వారు నగరానికి చేరకోనున్నట్లు ఏసీపీ తెలిపారు. బీహార్ నుంచి సైబరాబాద్ పోలీసు బృందం నగరానికి చేరుకున్న వెంటనే మరో రెండు బృందాలు నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగనున్నట్లు వివరించారు. అయితే ఇప్పటికే నిందితుడి కోసం వేట మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది. పోలీసులకు పట్టుబడిన నలుగురు నిందితులు ఇచ్చిన సమాచారంతో పాటు బీహార్ పోలీసుల సహకారంతో నిందితుడికోసం గాలిస్తున్నట్లు సమాచారం.