గత రెండు ఆదివారాలుగా సందర్శకులను కనువిందు చేస్తున్న చారిత్రక వారధి ట్యాంక్బండ్పై మరింత వినోదాన్ని, ఆహ్లాదాన్ని పంచేందుకు మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు చేపట్టింది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. రెండు వారాలుగా ఈ విధానం విజయవంతం కావడంతో పర్యాటకులకు మరింత అనుభూతి కల్పించేలా నేడు ఆర్మీ బృందంచే బ్యాండ్ ప్రదర్శన చేపట్టనున్నారు.
జానపద కళాకారుల ప్రదర్శనలతోపాటు చిన్నారులు మురిసిపోయేలా ఆర్ట్స్, క్రాప్ట్స్, మ్యూజిక్ తదితరాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. మాదాపూర్ శిల్పారామం హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులతోపాటు చేనేత, హస్తకళల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు సందర్శకులకు రుచికరమైన ఆహారమందించేందుకు ఫుడ్కోర్టులు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు నెలకొల్పుతున్నారు. కాగా మూడోరోజు కావడంతో ట్యాంక్బండ్పై వినాయక నిమజ్జనాన్ని రాత్రి 10 తర్వాతే నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఆదివారం సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు ట్యాంక్బండ్పై సందర్శకులను మాత్రమే అనుమతిస్తుండడంతో ఇక్కడికి చేరుకునేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్, కోఠి, కాచిగూడ స్టేషన్, మెహిదీపట్నం, హకీంపేట, చార్మినార్ల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబరు 11 (నమస్తే తెలంగాణ): విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ మహానగరంలో ట్యాంక్బండ్ ప్రత్యేకాకర్షణగా మారుతోంది. నగరవాసులే కాకుండా దేశ, విదేశీ పర్యాటకులకు సైతం సరికొత్త అనుభూతిని పంచేలా ట్యాంక్బండ్పై ప్రత్యేక చర్యలు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటలకు ట్యాంక్బండ్పై ట్రాఫిక్ను అనుమతించకుండా కేవలం నగరవాసులు మాత్రమే సరదా గడిపేలా చేయగా మంచి స్పందన వస్తున్నది. దీంతో మరిన్ని అదనపు ఆకర్షణలు ట్యాంక్బండ్పై ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించగా హెచ్ఎండీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆటాపాటలతో పాటు సంతోషంగా గడిపేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ ఆదివారం ట్యాంక్బండ్పై సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఇండియన్ ఆర్మీ బృందం బ్యాగ్పైపర్ బ్యాండ్ ప్రదర్శనను నిర్వహించనున్నది. సికింద్రాబాద్లోని ఏఓసీ కేంద్రంగా ఉండే బ్యాండ్ బృందం ప్రత్యక్షంగా ట్యాంక్బండ్పై ప్రదర్శన ఇవ్వనున్నది. ఆ తర్వాత స్థానిక కళాకారులు, గాయకులు తమ కళా నైపుణ్యంతో ట్యాంక్బండ్ పైకి వచ్చిన సందర్శకులను అలరించనున్నారు. తెలంగాణ సాంప్రదాయ జానపద కళాకారులు సైతం ప్రదర్శన ఇచ్చేలా హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ముఖ్యంగా చిన్నపిల్లలు మరింత ఎంజాయ్ చేసేలా ఆర్ట్స్, క్రాప్ట్స్, మ్యూజిక్ వంటి అంశాల్లో పోటీలను నిర్వహించనున్నారు. హస్తకళాకారులు తమ ఉత్పత్తులను ట్యాంక్బండ్పై ప్రదర్శించడంతో విక్రయించనున్నారు. టెస్కో చేనేత ఉత్పత్తులు, పర్యావరణ అనుకూలమైన రకరకాల హస్త కళలతో కూడిన స్టాల్స్ను ఈ ఆదివారం నుంచి ఏర్పాటు చేయనున్నది. మొత్తంగా ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత హైదరాబాద్ మహానగర నడిబొడ్డున ఉన్న హుస్సేస్సాగర్ తీరమంతా సందడికి కేరాఫ్ అడ్రస్గా మారనుందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
కుటుంబ సమేతంగా వచ్చిన ట్యాంక్బండ్పై సరదాగా గడిపే వారికోసం ఈ ఆదివారం నుంచి ఫుడ్ ట్రక్స్ను ఏర్పాటు చేస్తున్నారు. సంగీతం, షాపింగ్తో పాటు ఆహార ప్రియులు నిరాశ చెందకుండా ఉండేందుకు హైదరాబాద్ ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ను ఫుడ్ కోర్టులను ట్రక్కుల్లో అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు మొబైల్ పబ్లిక్ టాయిలెట్స్, అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్ను అధికారులు అందుబాటులో ఉంచనున్నారు.
సన్డే ఫన్ డే కార్యక్రమంలో భాగంగా 12న నిర్వహించనున్న వినాయక నిమజ్జనాన్ని రాత్రి 10 గంటల తర్వాతే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ సమయంలో ట్యాంక్బండ్ వైపునకు వినాయకులను అనుమతించకుండా ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ ఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా వైపు నిమజ్జనాలు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్యాంక్బండ్పై పాదచారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నారు.