కవాడిగూడ, మే 19 : ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను అనుమానంతో భర్త దారుణంగా హత్య చేశాడు. గాంధీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కవాడిగూడలో చోటు చేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. సంఘటనకు సంబంధించి గాంధీనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బోస్కిరణ్, మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం అత్తాపూర్ కిషన్బాగ్కు చెందిన బంగిరాజు తన భార్య బంగి దెబొరాను కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు బంగిరాజు అత్తాపూర్ పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు.
అత్తాపూర్ పరిధిలోని కిషన్బాగ్ ఎంఎన్గూడ కాలనీకి చెందిన బంగి దెబోరా(25)ను అదే ప్రాంతంలో నివాసం ఉండే బంగిరాజు(29) ప్రేమించి 2018లో పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దెబోరా తల్లిదండ్రులు, రాజు తల్లిదండ్రులు కిషన్బాగ్లోని ఎంఎన్గూడ కాలనీలోనే నివాసం ఉంటున్నారు. దెబోరా, రాజుకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత సంవత్సరం తన భర్త రాజు నిత్యం తనను వేధిస్తున్నాడని అత్తాపూర్ పోలీస్స్టేషన్లో దెబోరా పలుసార్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో తన భర్త రాజు నుంచి తనకు విడాకులు కావాలని ఫ్యామిలీ కోర్టులో సంవత్సరంన్నర క్రిందట కేసు వేశారు.
ప్రస్తుతం కేసు ట్రయల్కు వచ్చింది. తన భర్త నుంచి తనకు ప్రాణ హాని ఉందని, బంగి దెబోరా కోర్టులో కేసు వేసినప్పటి నుంచి తన తల్లిదండ్రులతో కలసి నివాసం ఉంటున్నది. అప్పటి నుంచి దెబోరా కవాడిగూడలోని ఓ సెలూన్ స్పా సెంటర్లో పనిచేస్తున్నది. తన భార్య కోర్టులో కేసు వేయడంతో పాటు తనకు దూరంగా ఉంటోందని ఆమెపై అనుమానం పెంచుకున్న బంగి రాజు కక్షతో ఆమెను ఎలాగైనా అంతం చేయాలని పథకం ప్రకారం మంగళవారం అత్తాపూర్నుంచి ఆటోలో కవాడిగూడ స్పా సెంటర్కు బయలుదేరిన బంగి దెబోరాను ద్విచక్రవాహనంపై వెంబడించిన రాజు ఆమె వెనకాలే కవాడిగూడకు చేరుకున్నాడు.
పదిన్నర గంటలకు ఆటో దిగి స్పా సెంటర్లోకి వెళ్తున్న బంగి దెబోరా ముందు ప్రత్యక్షమైన రాజు ఆమెతో గొడవకు దిగాడు. స్పా సెంటర్కు లిప్ట్లో ఎక్కిన వారు నాలుగో అంతస్తుకు చేరుకునేంత వరకూ ఇద్దరు గొడవ పడ్డారు. లిఫ్ట్లోంచి బయటికి వచ్చిన తర్వాత గొడవ పెరిగింది. రాజు తన వెంట బ్యాగులో తెచ్చుకున్న కత్తిని తీసి బంగి దెబోరా మెడ, కడుపు తదితర భాగాలపై దారుణంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
కాగా లిఫ్ట్లోంచి గొడవపడుతూ బయటికి వచ్చిన భార్యా భర్తలను గమనించిన అదే ప్లోర్లో కొనసాగుతున్న ఓ యూట్యూబ్ చానల్లో పనిచేస్తున్న ఇద్దరు యువకులు వారిని గమనించి గొడవను ఆపే ప్రయత్నం చేయగా రాజు వారికి కత్తి చూపించి బెదిరించడంతో వారు పక్కకు వెళ్ళిపోయారు. దెబోరా ప్రాణాలు కోల్పోయిన తర్వాత నిందితుడు పెద్దగా అరుస్తూ స్టెయిర్కేస్ నుంచి పరుగెత్తుకుంటూ వెళ్ళి ద్విచక్రవాహనంపై పారిపోయాడు. సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 108కి ఫోన్ చేసారు.
పరీక్షించిన 108 సిబ్బంది ఆమె అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. పోలీసులు క్యూస్టీంను పిలిపించి వివరాలు సేకరించడంతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. హత్య చేసిన వెంటనే అత్తాపూర్ పోలీస్స్టేషన్కు వెళ్ళి లొంగిపోయిన నిందితుడు రాజును గాంధీనగర్ పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి హత్యకు గల కారణాలేమిటి అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ బోస్కిరణ్ తెలిపారు.