సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ): అనుమానంతో భార్యను గన్తో కాల్చి చంపిన భర్తను, అతడికి ఆయుధం అందించడంలో సహకరించిన మరో పాత నేరస్తుడిని మల్కాజిగిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గురువారం మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ వివరాలు వెల్లడించారు. మల్కాజిగిరి మారుతీనగర్లో నివాసం ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి అరుణ్కుమార్, తన భార్య నిషారాణిపై అనుమానంతో ఆమెను హత్య చేసేందుకు గత కొంత కాలంలో ప్లాన్ చేశాడు. అందుకు గతంలో కంట్రీ మేడ్ పిస్టోల్ను కొనుగోలు చేసి ఆమెను హత్య చేసేందుకు కుట్ర చేశాడు.
అయితే పోలీసుల తనిఖీలలో రివ్వాలర్ దొరకడంతో అరుణ్కుమార్తో పాటు అతడికి తుపాకీ అందించిన మిర్ ముజిమిల్ అలీఖాన్తో పాటు మరో వ్యక్తిని అంబర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి గత నెలలో బయటకు వచ్చిన అరుణ్కుమార్కు భార్యపై కోపం తగ్గలేదు. ఈ క్రమంలోనే మరోసారి మిర్ ముజమిల్ అలీఖాన్ సహకారంతో మహారాష్ట్ర నుంచి కంట్రీమేడ్ పిస్టోల్ను కొనుగోలు చేశాడు. ఇదిలాఉండగా భార్య, భర్తల మధ్య ఐదు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున తన వద్ద ఉన్న గన్తో కాల్చి భార్యను హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు అరుణ్కుమార్ను మౌలాలీ రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడు గత నెల 27న మహారాష్ట్రలోని ఉమ్రి ప్రాంతం నుంచి మిర్ ముజమిల్ అలీ ఖాన్ సహకారంతో కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ప్రధాన నిందితుడు అరుణ్కుమార్తో పాటు ముజమిల్ అలీఖాన్ను అరెస్ట్ చేశారు. అరుణ్కుమార్కు సహకరించిన మరో వ్యక్తి హరిందర్ సింగ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.