జింఖానా మైదానంలో గురువారం చోటు చేసుకున్న ఘటన క్రీడాభిమానుల మనసు కలిచివేసింది. హెచ్సీఏ ఘోర వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. భారత్- ఆసీస్ మ్యాచ్ టిక్కెట్ల కోసం ఒక్కసారిగా క్రికెట్ ఫ్యాన్స్ ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు స్పృహ తప్పి పడిపోయారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు నియంత్రించడంతో ప్రమాదం తప్పింది. సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించిన హెచ్సీఏ తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తొక్కిసలాటలో రజిత అనే మహిళ అపస్మారక స్థితికి చేరుకోగా, లేడి కానిస్టేబుల్ నవీన సమయస్ఫూర్తితో వ్యవహరించి.. సీపీఆర్ చేసి..ప్రాణాపాయస్థితి నుంచి కాపాడారు.
సిటీబ్యూరో/సికింద్రాబాద్, సెప్టెంబర్ 22 : ఈ నెల 25న భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న టీ-20 మ్యాచ్కు టిక్కెట్ల విక్రయాలలో జింఖానా గ్రౌండ్లో తొక్కిసలాట జరిగింది. గురువారం సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు జరుగుతాయని హెచ్సీఏ ప్రకటించింది. మూడేండ్ల తరువాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ నిర్వహిస్తున్నారు. స్టేడియంలో మ్యాచ్ను చూడాలని క్రికెట్ అభిమానులు వారం రోజులుగా టిక్కెట్ల కోసం జింఖానా గ్రౌండ్, ఉప్పల్ స్టేడియం వద్ద ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మ్యాచ్ టిక్కెట్లు పేటీఎం ద్వారా విక్రయించామని, జింఖానాలో గురువారం విక్రయిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) బుధవారం ప్రకటించింది. దీంతో తెల్లవారుజాము నుంచే అభిమానులు జింఖానా మైదానం వద్ద టికెట్ల కోసం బారులు తీరారు. సుమారు 10 వేల నుంచి 12 వేల మంది కౌంటర్ ఓపెన్ చేస్తున్నారనగానే గేట్ వద్దకు ఒక్కసారిగా చొచ్చుకు వచ్చారు. ఈ క్రమంలోనే గేటు వద్ద తొక్కిసలాట జరిగింది. ఇందులో ఇద్దరు మహిళలతో పాటు ఐదుగురు అభిమానులకు గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు గాయపడ్డవారిని సికింద్రాబాద్లోని యశోద దవాఖానకు తరలించారు.
ప్రణాళిక లేని హెచ్సీఏ
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లతోపాటు పలు ఐపీఎల్ మ్యాచ్లు హైదరాబాద్లో జరిగాయి. ఏనాడు ఇలాంటి పరిస్థితి లేదు. ఉన్న టిక్కెట్లలో 40 నుంచి 50 శాతం వరకు ఆన్లైన్లో విక్రయిస్తూ, కొన్ని ఆఫ్లైన్లో, 10 నుంచి 15 శాతం వరకు కాంప్లిమెంటరీ టికెట్లుగా వాడుకుంటున్నారు. టికెట్ల విక్రయాలు మీ సేవ కేంద్రాల్లో, బ్యాంకుల్లో, ఇండోర్ స్టేడియాల్లో చేశారు. ఈ సారి ఆన్లైన్లో పేటీఎం ద్వారా విక్రయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 20న క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్కు వచ్చి ఆందోళన చేశారు. హెచ్సీఏపై పలువురు మానవ హక్కుల కమిషన్ను కూడా ఆశ్రయించారు. రెండు రోజుల విరామం తరువాత, భారీగా తరలివచ్చే క్రికెట్ అభిమానుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకుండానే హెచ్సీఏ గురువారం జింఖానా గ్రౌండ్లో టిక్కెట్లను విక్రయించేందుకు నిర్ణయించింది. టిక్కెట్ల విక్రయం వద్ద కనీసం వసతులు కూడా కల్పించలేదు. పైగా హెచ్సీఏ టిక్కెట్లన్నీ బ్లాక్ చేసిందని, కొన్ని మాత్రమే జింఖానా గ్రౌండ్లో విక్రయిస్తుందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో వచ్చిన క్రికెట్ అభిమానులతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. గుంపులను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేశారు. ఈ తొక్కిసలాటలో అభిమానులతో పాటు పోలీసులకూ గాయాలయ్యాయి. బేగంపేట్ ఠాణాకు చెందిన శ్రీకాంత్, సికింద్రాబాద్ ఫైర్ స్టేషన్కు చెందిన శ్రీనాథ్ యాదవ్తో పాటు సామాన్య పౌరులు సయ్యద్ అల్య, సుజాత, సాయి కిశోర్, రజిత, అదిత్య నాగ్లు గాయాలకు గురైన వారిలో ఉన్నారు. ఈ పరిస్థితిని గుర్తించి పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి, పరిస్థితిని చక్కదిద్దారు. ఘటనాస్థలికి నగర అదనపు పోలీస్ కమిషనర్ చౌహాన్, ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్, నార్త్జోన్ డీసీపీ చందనాదీప్తితో పాటు ఇతర అధికారులు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆలస్యంతోనే ఆగ్రహం…
క్రీడాభిమానులు కొందరు బుధవారం అర్ధరాత్రికే జింఖానా గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. గురువారం ఉదయం 10.30కు కౌంటర్లు ఓపెన్ చేసిన నిర్వాహకులు.. గ్రౌండ్ లోపల నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రధాన గేట్ నుంచి ఒక్కో కౌంటర్ వద్దకు ఐదుగురిని మాత్రమే అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా యూపీఐ పేమెంట్లను ఒప్పుకోకుండా, నగదు చెల్లింపులకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చారు. వాటిని కూడా అధార్ కార్డు, మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లు తీసుకొని టిక్కెట్లు ఇవ్వడంతో కౌంటర్ల వద్దనే ఆలస్యం జరిగింది. ఇది క్రికెట్ అభిమానులలో అసహనానికి దారి తీసింది. ఈ క్రమంలోనే అభిమానులు గేట్లు పగులగొట్టేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని వారించేందుకు లాఠీలకు పనిచెప్పారు. పరిస్థితి చక్కబడడంతో సాయంత్రం వరకు టిక్కెట్ల విక్రయాలు కొనసాగాయి.
శభాష్ నవీన
ఈ తొక్కిసలాటలో రజిత అనే మహిళ అపస్మారక స్థితికి చేరుకుంది. విధి నిర్వహణలో ఉన్న బేగంపేట్ మహిళా కానిస్టేబుల్ నవీన, మరో కానిస్టేబుల్ కలిసి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. క్షణాల వ్యవధిలోనే అపస్మారక స్థితిలో ఉన్న మహిళ గుండెపై ప్రెస్ చేస్తూ ఆమెకు సీపీఆర్ (నోటి ద్వారా శ్వాస) అందిస్తూ ప్రాణపాయ స్థితి నుంచి బయటకు తెచ్చారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. నవీన సమయస్ఫూర్తిని అందరూ ప్రశంసించారు. తాను శిక్షణలో నేర్చుకున్న విషయంతో ఆపదలో ఉన్న మహిళ ప్రాణాలను కాపాడగలిగానని నవీన తెలిపారు.