Part Time Jobs | సిటీబ్యూరో, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): పార్ట్టైమ్ జాబ్ పేరుతో ఎక్స్పోర్టు వ్యాపారం చేసే ఒక వ్యక్తికి సైబర్ నేరగాళ్లు రూ. 23 లక్షలు టోకరా వేశారు. రెగ్యులర్ టాస్క్, మర్చంట్ టాస్క్ల పేరుతో రూ. 200 నుంచి రూ. 6 వేల వరకు ముందుగా పెట్టుబడులు పెట్టించి.. లాభాలొచ్చాయంటూ నమ్మించి ఆ తరువాత నిండా ముంచేశారు. చార్మినార్ ప్రాంతానికి చెందిన బాధితుడు ఎక్స్పోర్టు వ్యాపారం చేస్తుంటాడు. పార్ట్టైమ్ జాబ్ ఉందంటూ ఈ నెల 7న వాట్సాప్కు ఒక మెసేజ్ వచ్చింది. గూగుల్ మ్యాప్కు 5 స్టార్ రేటింగ్ ఇవ్వడమే పని అని.. మీకు టెలిగ్రామ్లో డెమో ఇస్తామంటూ లింక్ పంపించారు. ఆ లింక్ క్లిక్ చేయగానే టెలిగ్రామ్లోకి వెళ్లి, మ్యాప్ రివ్యూ ఎలా చేయాలో వివరించారు. ముందుగా ఐదు రివ్యూలు చేయమని చెప్పి రూ. 200 పంపించారు.
22 టాస్క్లలో 17 రెగ్యులర్, 5 టాస్క్లు మర్చంట్కు సంబంధించినవి ఉంటాయని, మర్చంట్ టాస్క్లలో యూఎస్డీ ట్రేడింగ్ కూడా ఉంటుందంటూ నమ్మించారు. ఆ తరువాత మరో లింక్ను పంపించడంతో ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యింది. అందులో సైబర్నేరగాళ్లు చెప్పినట్లు బాధితుడు పెట్టుబడి పెడుతూ వెళ్లాడు. మొదట రెండు వేల నుంచి రూ. 12 వేల వరకు పెట్టుబడి పెట్టడంతో మీకు లాభాలొచ్చాయంటూ నమ్మిస్తూ కొంత మొత్తం బాధితుడి బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశారు. ఆ తరువాత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటూ నమ్మించి దఫ దఫాలుగా రూ. 23.22 లక్షలు పెట్టుబడిగా పెట్టంచి నిండా ముంచేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
డి6.ఏపీకే కస్టమర్ సపోర్టు నుంచి మాట్లాడుతున్నామని.. ఇంటి నుంచే పార్ట్టైమ్ జాబ్ చేయవచ్చని చెప్పారు. రూ. 2 పెట్టుబడిగా పెట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు లక్ష రూపాయలు కాజేశారు. ముషీరాబాద్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్కాల్ వచ్చింది. వాళ్లు చెప్పేది నిజమని బాధితుడు నమ్మాడు. వాళ్లు లింక్ పంపించగానే క్లిక్ చేసి, అందులో బ్యాంకు వివరాలు, పాన్కార్డు, ఆధార్ నంబర్ను అప్లోడ్ చేశాడు. ఆ తరువాత ర్యాపీడో యాప్లో రూ. 2 పెట్టుబడిగా పెట్టాలని సూచించిన నేరగాళ్లు.. లింక్ అప్డేట్ అవుదంటూ చెప్పారు. బాధితుడు తన బ్యాంక్ ఖాతా నుంచి రెండు రూపాయలు బదిలీ చేసేందుకు ప్రయత్నిస్తుండగానే.. ఆ ఖాతాతో పాటు మరో రెండు బ్యాంకు ఖాతాల్లో నుంచి నేరగాళ్లు దఫ దఫాలుగా రూ. 2.04 లక్షలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.