మారేడ్పల్లి, జనవరి 11: సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ జూబ్లీబస్టాండ్లో సూమారు 100 మందికి పైగా ఆర్టీసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులకు సేవలందిస్తున్నారు. నిత్యం 35 నుంచి 40 వేల మంది ప్రయాణికులు పండగ సందర్భంగా వారి వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు రాకపోకలు సాగిస్తుడడంతో జేబీఎస్ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది.
1 నుంచి 23 ప్లాట్ ఫారాల నుంచి 40 రూట్లలో 1200 వందల ట్రిప్పుల బస్సు సర్వీసులు నడుస్తున్నాయని పికెట్ డిపో మేనేజర్ జి. సురేశ్ వెల్లడించారు. మరో రెండు మూడు రోజుల్లో సూమారు 500 ట్రిప్పులు పెరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జేబీఎస్ బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యార్థం కోసం 6 హెల్ప్ డెస్క్లను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. 1 నుంచి 13వ ప్లాట్ ఫారం వరకు 3 హెల్ప్ డెస్క్లు ఉండగా, 14 ప్లాట్ ఫారం నుంచి 23వ ప్లాట్ ఫారం వరకు మరో 3 హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు అనుక్షణం పబ్లిక్ అనౌన్స్మెంట్ ద్వారా ఏ బస్సు ఎక్కడికి వెళ్తుంది, ఏ ప్లాట్ ఫారంలో ఉందో ప్రయాణికులకు అర్థమయ్యే రీతిలో ఈ సిస్టమ్ అందుబాటులో ఉంది.
తెలంగాణలోని సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాల, గోదావరిఖని, ఆసిఫాబాద్, కోరుట్ల, మెట్పల్లి ,జగిత్యాల, యాదగిరిగుట్ట, జనగాం, తొర్రూర్, హన్మకొండ, వరంగల్, రంగారెడ్డి, ఆర్మూర్, నర్సాపూర్, బైంసా తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులను నడుపతున్నామని, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరం ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ జి.సురేశ్ తెలిపారు. దీంతో పాటు శ్రీశైలం, తిరుపతి, అనంతపూర్, బెంగళూర్, విజయవాడ తదితర ప్రాంతాలకు జేబీఎస్ నుంచి 12 బస్సు సర్వీసులు నడుస్తున్నాయన్నారు.
రైల్వే స్టేషన్లో కట్టుదిట్టమైన చర్యలు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు సికింద్రాబాద్ రైల్వే (జీఆర్పీ)ఇన్స్పెక్టర్ ఎం. శ్రీను తెలిపారు. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో ఈ రైల్వేస్టేషన్ నుంచే వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండడంతో రైల్వే పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
రైలు ఎక్కే సమయంలో ప్రయాణికుల మధ్య తోపులాటలు జరుగకుండా రైల్వే పోలీసులు బోగీల వద్ద విధులు నిర్వహిస్తూ.. క్యూ పద్ధ్దతిలో రైలెక్కిస్తున్నారు. దీంతో పాటు స్టేషన్లో, రైళ్లలో చైన్స్నాచింగ్లు, దొంగతనాలు జరుగకుండా పట్టిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాత నేరస్తుల పై నిఘాను ముమ్మరం చేస్తూ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణ సమయంలో విలువైన సవ్తువులు, నగదు విషయంలో జాగత్తగా ఉండాలని, అపరిచితు లు ఇచ్చే ఇనుబండారాలు పానీయాలను స్వీకరించొద్దని, అనుమానిత వస్తువులు గుర్తిస్తే వెంటనే పోలీసు కంట్రోల్ రూం నంబర్ 100కు, రైల్వే టోల్ ఫ్రీ నంబర్ 1512కు సమాచారం ఇవ్వాలని రైల్వే జీఆర్పీ ఇన్స్పెక్టర్ ఎం.శ్రీను వెల్లడించారు. రైల్వే స్టేషన్లో నిత్యం సూమారు 300మంది పోలీసు సిబ్బం ది భద్రతాపరంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.