సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : ఆటో డ్రైవర్లకు ఇంధన కష్టాలు తప్పడం లేదు. రెండు వారాలుగా ఆటో గ్యాస్ సరిపడా లేకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. ఆటో నడిపితే గానీ కుటుంబం గడవని పరిస్థితుల్లో గ్యాస్ సరఫరా లేక బంక్లు మూతపడ్డాయి. అక్కడక్కడ తెరిచిన బంక్ల ముందర కిలో మీటర్ల మేర ఆటోలు క్యూలైన్ ఉంది. శుక్రవారం ఎర్రమంజిల్ ఆటో గ్యాస్ సెంటర్ నుంచి పంజాగుట్ట సర్కిల్ వరకు ఆటోలు గ్యాస్ కోసం క్యూ కట్టాయి. వంద ఆటోలకు ఇంధనం సరపరా చేసి గ్యాస్ లేదని బంక్లు చేతులెత్తేస్తున్నాయి.
ప్రభుత్వం ఇంధన వినియోగంపై సరైన చర్యలు తీసుకోకపోవడంతో బంక్ నిర్వాహకులు ఇష్టానుసారంగా ఇంధన వ్యాపారం చేస్తున్నారు. అక్కడక్కడ రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నారని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎల్పీజీ ధర రూ.63 ఉండగా ఇప్పుడు 90 దాటిందని తెలిపారు. బంక్ నిర్వాహకులు కృత్రిమ ఇంధన కొరత సృష్టించడంలో భాగంగానే చాలా ఎల్పీజీ, సీఎన్జీ బంక్ల వద్ద నో స్టాక్ బోర్డు పెట్టారని ఆటో డ్రైవర్లు వాపోయారు. నో స్టాక్ బోర్డులను చూసిన వాహనదారులు వాళ్లడిగినంత ధర చెల్లిస్తారని బ్లాక్ మార్కెట్కు తెరలేపారు. బంక్ మోసాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉచిత ప్రయాణంతో తగ్గిన గిరాకీ!
ఉచిత బస్సుతో గిరాకీ లేక ఇప్పటికే ఆటో వాలాలు దిక్కుతోచని స్థితిలో కొ ట్టుమిట్టాడుతున్నారు. రేవంత్ సర్కార్ ఆటోవాలాలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తానన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదు. దీంతో ఆటో డ్రైవర్లు మానసికంగా కుంగిపోతున్నారు. 200 మంందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. తమ సంక్షేమం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మళ్లీ వారు కోలుకోలేని విధంగా ఇంధన కొరత ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేమని చాలా మంది గ్యాస్ బండ్లు నడుపుకుంటున్నారు.