Khairatabad | ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వేకువ జాము నుంచే భక్తులు బారులు తీరి దశ మహా విద్యా గణపతిని దర్శించుకుంటున్నారు. ఖైరతాబాద్ పరిసరాలన్నీ భక్తులు, వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. గణేశ్ మహరాజ్ కీ నినాదాలతో మార్మోగుతున్నది. మెట్రో స్టేషన్, ట్యాంక్బండ్, టెలిఫోన్ భవన్ నుంచి వస్తున్న భక్తుల కోసం పోలీసులు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. క్యూలైన్ల నుంచి వచ్చే వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు.
దాదాపు మధ్యాహ్నం వరకు లక్షన్నరకుపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. మరో వైపు పలువురు ప్రముఖులు సైతం ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో వైపు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. మరో వైపు నగరంలో పలుచోట్ల గణేశ్ నిమజ్జనం ఉత్సవాలు కొనసాగుతున్నాయి.