సిటీబ్యూరో, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ): పేరుకుపోయిన ఈ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు రాయితీని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022లో మార్చిలో పెండింగ్ చలాన్స్ క్లియరెన్స్కు 50 నుంచి 75 % వరకు కేసీఆర్ ప్రభుత్వం అవకాశమిచ్చింది. సుమారు 3 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ కాగా రూ.300 కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మరోసారి కొత్త ప్రభుత్వం అదే విధంగా చలాన్స్ క్లియరెన్స్కు అవకాశమిచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 కోట్లకుపైగా పెండింగ్ చలాన్లు ఉండగా అందులో 60 నుంచి 70 శాతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధికి చెందినవే ఉంటాయని పోలీసులు పేర్కొంటున్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని చలాన్లలో ఆర్టీసీ, ఆటో, ద్విచక్రవాహనాలు, కార్లు, భారీ వాహనాలకు వివిధ కేటగిరి చొప్పున డిస్కౌంట్ను ప్రకటించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులపై కాంటాక్టు, నాన్ కాంటాక్ట్ పద్ధతిలో ట్రాఫిక్ పోలీసులు ఈ చలాన్లు జారీ చేస్తున్నారు.
ఈ చలాన్లు జారీ అయిన వారు కొందరు చెల్లించినా, మరికొందరు చెల్లించకుండా పెండింగ్లో పెట్టారు. ఎక్కువగా పేరుకుపోవడంతో స్పెషల్ డ్రైవ్ పెట్టి పేరుకుపోయిన జరిమానాలను వసూలు చేసేవారు. అయినా కూడా చాలామంది చలాన్లు చెల్లించకపోవడంతో ట్రై కమిషనరేట్ల పరిధిలో సుమారు 1.4 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మరోసారి అవకాశాన్ని వాహనదారులకు కల్పించారు. ఆన్లైన్లో ఈ చలాన్ పోర్టల్ ద్వారా రాయితీతో కూడిన చలాన్లు చెల్లించుకోవాలి. జనవరి 10వ తేదీ వరకు సమయం ఉంది.