సైదాబాద్, ఫిబ్రవరి 26: రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం సైదాబాద్ శంకేశ్వర బజార్లోని అషూర్ ఖానా వద్ద సెంట్రల్ సౌత్ పీస్ వెల్ఫేర్, ఈస్ట్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలందరికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి మందులు, అద్దాలను అందజేస్తుందన్నారు.
శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు చేస్తున్న సేవలకు, పీస్ కమిటీ ప్రతినిధులు తమ వంతు సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరంలో యశోద దవాఖాన వైద్య సిబ్బంది పాల్గొని కార్డియాలజీ, గైనకాలజీ, ఆర్థ్ధోపెడిక్, జనరల్, కంటి, డెంటల్ చెకప్లను ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ పీస్ వెల్ఫేర్ కమిటీ సౌత్, ఈస్ట్ పీస్ కమిటీ ఆల్ జోన్ జనరల్ సెక్రటరీ శ్రీకిషన్ శర్మ, సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ శశికాంత్ అగర్వాల్, సౌత్ జోన్ ప్రెసిడెంట్ ఘజివుద్దీన్, ఈస్ట్ జోన్ ప్రెసిడెంట్ ఎన్. నారాయణ రెడ్డి, జనరల్ సెక్రటరీ మజారుద్దీన్ అహ్మద్, బీఆర్ఎస్ మలక్పేట ఇన్చార్జి ఆజం అలీ పాల్గొన్నారు.