సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో మురుగు సమస్యల పరిష్కారానికి రూ. 35కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జలమండలి ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. శనివారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో శివారు మున్సిపాలిటీల సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అక్టోబర్ 1 నుంచి శివారు మున్సిపాలిటీల్లో సీవరేజీ నిర్వహణ బాధ్యతలు జలమండలి స్వీకరించిన సంగతి విదితమే. ఆయా ప్రాంతాల్లో సీవరేజీ తరచూ ఓవర్ఫ్లో అవుతున్న ప్రాంతాలను గుర్తించాలని గతంలో అధికారులను ఆదేశించారు.
ఆయన ఆదేశాల మేరకు జలమండలి మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. మొత్తం 792 హాట్స్పాట్లను గుర్తించారు. ఈ హాట్స్పాట్ల వద్ద మురుగు సమస్యను పరిష్కరించేందుకు ప్రాధాన్యతాక్రమంలో జలమండలి శాఖ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా సుమారు రూ.35 కోట్లతో రెండు వారాల్లో పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జలమండలి ఈడీ డాక్టర్ సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్బాబు, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్కుమార్, ఆపరేషన్ డైరెక్టర్-1 అజ్మీరా కృష్ణ, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ఆపరేషన్ డైరెక్టర్-2 స్వామి, సీఎంఎలు, జీఎంలు, డీజీఎంలు పాల్గొన్నారు.