సిటీబ్యూరో, సెప్టెంబరు 22 (నమస్తే తెలంగాణ): వాణిజ్య (నాన్ డొమెస్టిక్) కనెక్షన్లకు సంబంధించిన నీటి బిల్లుల బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జల మండలి ఎండీ దాన కిశోర్ అధికారులకు సూచించారు. బుధవారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సీజీఎంలు, జీఎంలతో ఎండీ రెవెన్యూపై సమీక్ష సమావేశం నిర్వహించారు. బకాయిలు చెల్లించని నాన్ డొమెస్టిక్ వినియోగదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ అక్టోబరు చివరి నాటికి ప్రతీ వినియోగదారుడి నుంచి 100 శాతం బకాయిలు వసూలు చేయాలని, అలాగే మిగిలిన వాణిజ్య కనెక్షన్ వినియోగదారుల నుంచి 50 శాతం బకాయిలను అక్టోబరులో కచ్చితంగా వసూలు చేయాలని, మూడు నెలల్లో మొత్తం 100 శాతం పూర్తి చేయాలని ఆయన అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. వాణిజ్య కనెక్షన్లు తీసుకున్న నాటి నుంచి అసలు బిల్లులే చెల్లించని వినియోగదారుల నల్లా కనెక్షన్ను వెంటనే తొలగించాలని ఆదేశించారు. రెవెన్యూ వసూలులో ఉదాసీనంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అధికారులను హెచ్చరించారు.
వాణిజ్య కనెక్ష న్ వినియోగదారులకు సంబంధించిన నెల వారీ బిల్లుల జారీ, వసూలు ఆన్లైన్ ద్వారా జరిగేలా నూతన విధానం అమలుపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్లు ఎండీ దాన కిశోర్ పేరొన్నారు. మొదటగా నేరుగా బిల్లును జారీ చేయకుండా ఆన్లైన్ (ఎస్ఎంఎస్ , వాట్సప్ , ఈమెయిల్ ) మాధ్యమాల ద్వారా జారీ చేసి, బిల్లు వసూలు కూడా డిజిటల్ పేమెంట్ అయ్యేలా చూసేందుకు ఈ కమిటీలో చర్చించి తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.
వాణిజ్య కనెక్షన్ల వివరాలను పకాగా నమోదు చేయడానికి కొత్త మొబైల్ యాప్ను రూపొందించినట్లు ఎండీ దానకిశోర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని నాన్ – డొమెస్టిక్ కనెక్షన్లకు సంబంధించిన సమగ్ర వివరాలను సర్వే చేసి ఈ యాప్లో నమోదు చేయాలని ఆయన సూచించారు. అలాగే, ప్రతీ నాన్ డొమెస్టిక్ కనెక్షన్ను జియోట్యాగింగ్ చేయాలని ఆయన పేరొన్నారు.
పనిచేయని మీటర్లు కలిగి ఉన్న వాణిజ్య కనెక్షన్ వినియోగదారులకు నోటీసులు ఇచ్చి జరిమానా విధించడానికి కసరత్తు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్ , డైరెక్టర్ ఆపరేష న్ – 2 స్వామి, సీఈవో రవిచంద్రన్ రెడ్డి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు పాల్గొన్నారు.