సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): జలమండలి పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మురుగునీటి నిర్వహణ, భద్రతపై 15 రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జలమండలి ఎండీ ఎం.దాన కిశోర్ వెల్లడించారు. గురువారం జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ ఈనెల 16 నుంచి 30వతేదీ వరకు జలమండలిలో పనిచేస్తున్న సివరేజీ కార్మికులకు మురుగునీటి నిర్వహణలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, భద్రతా పరికరాల పనితీరు, పారిశుధ్య పనులు నిర్వహించే సమయంలో అవలంభించాల్సిన పద్ధ్దతులపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. భారీ, మినీజెట్టింగ్ యంత్రాలను ఉపయోగించే యజమానులు, వాటి ఆపరేటర్లకు కూడా ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జలమండలి ఈఎన్సీ డైరెక్టర్ ఆపరేషన్స్-1 అజ్మీరా కృష్ణ, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ రవిచంద్రన్రెడ్డి, సీజీఎంలు, డీజీఎంలు తదితరులు పాల్గొన్నారు.