సిటీబ్యూరో, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ): జలమండలి ఓ అండ్ ఎం ఆరో డివిజన్ పరిధిలోని ఎస్సార్ నగర్లో పారిశుధ్య కార్మికులకు మురుగునీటి నిర్వహణ, భద్రత వంటి అంశాలపై శనివారం జలమండలి అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్మికుల కోసం జలమండలి అధికారులు మురుగునీటి నిర్వహణలో ఉపయోగించే భద్రతా పరికరాలపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. భద్రతా పరికరాల పనితీరు, వాటిని ఉపయోగించే విధానం, మురుగును మ్యాన్ హోళ్లలో శుద్ధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు చేసే ప్రథమ చికిత్స వంటి అంశాలపైనా కార్మికులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న కార్మికులు తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు. బాడీ సూట్ వంటి భద్రతా పరికరాలను ధరించాలన్నారు. కార్మికులకు ఆరోగ్య బీమా సౌలభ్యం గురించి వివరాలు తెలిపారు. అలాగే, వారి సంక్షేమ సంస్థ సఫాయి కరంచారి కమిషన్ నియమ నిబంధనల గురించి వివరించారు. సదస్సులో జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్బాబు, ఈఎన్సీ, డైరెక్టర్ ఆపరేషన్స్-1 ఆజ్మీరాకృష్ణ, సీజీఎం ప్రభు, జీఎం హరిశంకర్, డీజీఎంలు, మేనేజర్లు, యూనియన్ నాయకులతో పాటు కార్మికులు, ఎయిర్ టెక్ మిషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.