సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా ముందుకెళ్తున్న హెచ్ఎండీఏ గ్రేటర్ చుట్టూ శివారు ప్రాంతాల్లో కొత్త లే అవుట్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. భూ సమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీం)లో భాగంగా రైతుల నుంచి భూములను సేకరించి వారి అంగీకారంతోనే హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం లే అవుట్లను అభివృద్ధి చేస్తున్నది. గత కేసీఆర్ ప్రభుత్వం 2017లో భూ సమీకరణ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే మొట్ట మొదటిసారిగా రెండు చోట్ల భారీ లే అవుట్లను ఏర్పాటు చేయగా, మరో మూడు ప్రాంతాల్లో భూములను సేకరించే పనిలో హెచ్ఎండీఏ నిమగ్నమైంది.
నిబంధనలకు అనుగుణంగా..
మొదటగా రంగారెడ్డి జిల్లా శ్రీశైలం జాతీయ రహదారిలో ఉన్న కందుకూరు మండల పరిధి లేమూర్లో 87 ఎకరాల్లో, కొత్తూరు మండల పరిధి ఇన్ముల్నర్వ గ్రామ రెవెన్యూ పరిధిలోని 94 ఎకరాల్లో లే అవుట్లను అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ డెవలప్మెంట్ అగ్రిమెంట్ను కుదుర్చుకున్నది. నిబంధనలకు అనుగుణంగా విశాలమైన రోడ్లు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నది. ప్రస్తుతం ఈ పనులు చివరి దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. త్వరలోనే రైతుల వాటాగా 60 శాతం కింద ఎకరానికి 1742 గజాలను కేటాయించి, మిగిలిన 40 శాతం వాటా కింద 1161 చదరపు గజాలను అభివృద్ధి చేసిన లే అవుట్లో హెచ్ఎండీఏ తమ ల్యాండ్బ్యాంకుగా పెట్టుకోనున్నది.
త్వరలో మరో 3 చోట్ల..
భూ సమీకరణ పథకంలో భాగంగా మొదటి దశలో రెండు చోట్ల లేఅవుట్లను అభివృద్ధి చేయగా, రెండో దశలో దండు మల్కారంలో 300 ఎకరాలు, బోగారంలో 110 ఎకరాలు, ప్రతాపసింగారంలో 150 ఎకరాల్లో హెచ్ఎండీఏ భారీ లే అవుట్లను వేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసి, రైతుల నుంచి అంగీకారాన్ని సేకరించే పనిలో ఉన్నది. ఈ పథకాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టి భూ యజమానులు భూ సమీకరణ పథకం కింద భూములను ఇచ్చేందుకు అనుకూలమైన వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఇదే స్ఫూర్తితో భవిష్యత్లోనూ హెచ్ఎండీఏ పరిధిలో భూ సమీకరణ పథకం కింద లే అవుట్లను అభివృద్ధి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా హెచ్ఎండీఏ లక్ష్యం నెరవేరుతుందని అధికారులు పేర్కొంటున్నారు.