సిటీబ్యూరో, నవంబరు 7(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ ప్రత్యేకంగా ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నాయి. ఔటర్ రింగు రోడ్డు లోపల, బయట ఉన్న గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల్లో నిధులు సరిపడా లేకపోవడంతో ప్రభుత్వం హెచ్ఎండీఏ నుంచి నిధులు కేటాయించడంతో పాటు పనులను చేపట్టే బాధ్యతలను అప్పగిస్తోంది. తాజాగా బాచుపల్లి-బౌరంపేట-మల్లంపేట మార్గంలో రోడ్డు నిర్మాణం కోసం సుమారు రూ.138 కోట్లతో ప్రతిపాదనలను హెచ్ఎండీఏ సిద్ధం చేసింది. ఈ రోడ్డు పనులకు సంబంధించి రెండు రోజుల కిత్రం హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
స్థానిక ప్రజా ప్రతినిధులతోనూ సమావేశమై రోడ్డు సౌకర్యంపై చర్చించారు. ఔటర్ రింగు రోడ్డును ఆనుకొని శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులైన రోడ్డు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి వాటిని కల్పించేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది. అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధుల కోసం సంబంధింత శాఖ నుంచి కేటాయించి, వేగవంతగా ఆయా పనులు పూర్తి చేసేలా పురపాలక శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. దాని ఫలితంగానే శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తుండటంతో నగరవాసులు ఆయా ప్రాంతాల్లో నివాసంఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఔటర్ రింగు రోడ్డు నుంచి నగరంలోకి వచ్చేందుకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో విశాలమైన వెడల్పుతో రేడియల్ రోడ్లను నిర్మించారు. అయినప్పటికీ కొన్ని చోట్ల కొత్తగా రోడ్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. తాజాగా మియాపూర్ నుంచి మైసిగండికి వెళ్లే మార్గంలో ఉన్న బాచుపల్లి నుంచి ఓఆర్ఆర్కు అనుసంధానం అయ్యే రహదారిని ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండేలా నిర్మించాలని ప్రభుత్వం స్థానిక సంస్థలకు సూచించింది. ఈనేపథ్యంలోనే బాచుపల్లి నుంచి బౌరంపేట మీదుగా మల్లంపేట ఓఆర్ఆర్ వరకు ఉన్న రహదారిని అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.138 కోట్లతో హెచ్ఎండీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.