మాదాపూర్, ఆగస్టు 18 : హైదరాబాద్కు ఉత్తరం వైపునా మరో విమానాశ్రయం అవసరముందని, వచ్చే నెలలో మెట్రో రైల్తో పాటు ఎయిర్ పోర్టు ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు సన్నాహలు జరుగుతున్నాయని టీఎస్ఐఐసీ, ఎఫ్ఏసీ వీసీ, ఎండీ ఈ.వెంకట్ నరసింహరెడ్డి అన్నారు. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన హిమ్టెక్స్, ఐపీఈసీ ఎక్స్ పో కార్యక్రమానికి వెంకట్ నరసింహరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్, ఇనిస్టిట్యూట్ అడిషనల్ డెవలప్మెంట్ కమిషనర్ డి.చంద్రశేఖర్, ఎల్అండ్టీ మెట్రో రైల్ హైదరాబాద్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీర్ చిప్లంకర్, హైటెక్స్ బిజినెస్ హెడ్ టీజీ శ్రీకాంత్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధిపై దృష్టిపెట్టిందని తెలిపారు. ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు రాష్ట్రంలో రహదారుల విస్తరణతో పాటు లింకు రోడ్లను కలుపుకొని రీజనల్ రింగ్ రోడ్డును వేసేందుకు సన్నాహలు జరుగుతున్నాయని, ఇప్పటికే భూ సేకరణ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. హైదరాబాద్లో మెట్రో రైల్తో పాటు ఉత్తరాన ఎయిర్ పోర్టు ప్రాజెక్టులను వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహలు జరుగుతున్నాయని చెప్పారు. రానున్న మూడునాలుగేండల్లో తెలంగాణ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయని తెలిపారు. హమ్టెక్స్, ఐపీఈసీ ఎక్స్ పోలో 85 మంది ఎగ్జిబిటర్లకు ఎంఎస్ఎంఈ పరిశ్రమ మద్దతిస్తుందని పేర్కొన్నారు.
ఒక్కో యూనిట్కు రూ.1.5 లక్షల వరకు సహయం చేసేందుకు మంత్రిత్వ శాఖ స్వయంగా 20 ఎక్స్పోలను నిర్వహించనున్నదని, అందుకు సన్నాహలు చేస్తుందని తెలిపారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో మెషిన్ టూల్స్, మెషిన్ టూల్స్యాక్ససరీస్, కట్టింగ్ టూల్స్, హైడ్రాలిక్స్, న్యూమాటిక్స్, మెటీరియల్ హ్యండ్లింగ్ ఎక్విప్మెంట్లు, మెట్రాలజీ సొల్యూషన్స్, జనరల్ ఇంజినీరింగ్ ఉత్పత్తులతో పాటు సరికొత్త టెక్నాలజీతో కూడిన ఉత్పత్తులను ప్రదర్శించగా ఐపీఈసీ టెక్నాలజీలో ఇండస్ట్రీయల్ బాయిలర్స్ లిమిటెడ్, యూనిఫ్లో కంట్రోల్స్, యూరోమ్యాక్స్ ఇంటర్నేషనల్, బ్రైటెక్ వాల్వ్స్, కెమ్డిస్ట్, ఎల్ అండ్ టీ వాల్వ్స్, స్టీమ్ హౌస్, సీఆర్ఐ పంపులు, చీమా బాయిలర్లు, ఫైన్ఫ్యాక్ స్ట్రక్చర్స్ వంటి ఉత్పత్తులను ప్రదర్శించారు. అంతేకాకుండా మెషినరీ, పరికరాల తయారీదారులు, సర్వీస్ ప్రొవైడర్లు, ఫార్మా, కెమికల్స్, బయో టెక్నాలజీ, ఫుడ్, ఆగ్రో ప్రాసెసింగ్, పెట్రో కెమికల్స్, మినరల్స్, పవర్, స్టీల్ వంటి పరిశ్రమల నుంచి వచ్చిన నూతన ఆవిష్కరణకు వేదికైంది.