బంజారాహిల్స్,డిసెంబర్ 26:బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ ఆవరణలో ఆందోళన పేరుతో హంగామా సృష్టించడంతో పాటు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో 10మంది హిజ్రాలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం..ఇందిరానగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న సోనా రాథోడ్తో పాటు సుమారు 25మంది హిజ్రాలకు మోనాలిసా అనే మరో హిజ్రా గ్రూపుతో విభేదాలు ఉన్నాయి. తమపై మోనాలిసా దాడులు చేయిస్తోందని, రౌడీలను ఉసిగొల్పుతూ తమను భయాందోళనకు గురి చేస్తోందంటూ ఆదివారం వారంతా బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు వచ్చారు. తమపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు బెదిరిస్తున్న మోనాలిసా మీద కేసు నమోదు చేయాలంటూ పీఎస్ ఆవరణలో బైఠాయించారు. అంతటితో ఆగకుండా సోనా రాథోడ్, స్వీటీ, బుల్బుల్, రుబీ తదితర హిజ్రాలు కిరోసిన్ పోసుకోవడంతో పాటు ఇతర హిజ్రాలను కూడా కిరోసిన్ పోసుకోవాలంటూ రెచ్చగొట్టారు. వారిని ఆపేందుకు ప్రయత్నించిన మహిళా పోలీసులను తోసేయడంతో పాటు దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు సముదాయిస్తున్నా వినకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ వీరంగం సృష్టించారు.
ఈ మేరకు బంజారాహిల్స్ ఎస్ఐ అంబిక ఇచ్చిన ఫిర్యాదుతో సోనా రాథోడ్, స్వీటీ, బుల్బుల్, రుబీతో సహా మొత్తం 20మంది హిజ్రాలపై ఐపీసీ 353,306 రెడ్విత్ 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో 10మంది హిజ్రాలను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో రోజా,వసు, హిమ, అంశు, నందు, లక్ష్మి, వైష్ణవి, స్పందన, జోయా, రియా తదితరులు ఉన్నారు. కాగా ఈ వ్యవహారంలో ప్రధాన నిందితురాలు సోనా రాథోడ్, బుల్బుల్ తదితరులు పరారీలో ఉండగా, వారికోసం గాలింపు చేపట్టారు.