అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినంను పురసరించుకొని శనివారం బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ‘మిషన్ పరివర్తన’ పేరుతో యాంటీ నారోటిక్స్ బ్యూరో(టీ-న్యాబ్) నిర్వహించిన 3 రోజుల క్యాంపెయిన్ను ప్రముఖ సినీ నటులు నిఖిల్, ప్రియదర్శితో కలిసి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు, యువత డ్రగ్స్ దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : డ్రగ్స్కి అందరూ దూరంగా ఉండాలి…మాదక ద్రవ్యాలకి అలవాటు పడితే అదే డెత్ సెంటన్స్.. చాలా సార్లు డ్రగ్స్ తీసుకోమని నన్ను అడిగారు.. విద్యార్థులకు ఎంతో అందమైన జీవితం ఉంది.. దాన్ని అనుభవించండి…సే నో టూ డ్రగ్స్ ..అంటూ టాలీవుడ్ నటుడు నిఖిల్ సంచలన కామెంట్స్ చేశారు. సెలబ్రిటీలలో డ్రగ్స్ బాధితులు ఉండొచ్చని, కానీ కొంతమంది చేసే తప్పులను మొత్తం ఇండస్ట్రీకి ఆపాదించవద్దన్నారు. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేను పురసరించుకొని శనివారం బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ‘మిషన్ పరివర్తన’ పేరుతో యాంటీ నారోటిక్స్ బ్యూరో(టీ-న్యాబ్ ) నిర్వహించిన 3 రోజుల క్యాంపెయిన్ను ప్రముఖ సినీ నటులు నిఖిల్, ప్రియదర్శితో కలిసి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. అనంతరం సినీ నటుడు నిఖిల్ మాట్లాడుతూ డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు వాటి జోలికి వెళ్లొద్దన్నారు. మాదక ద్రవ్యాల రహిత తెలంగాణ అవ్వాలని కోరుకుంటునట్లు తెలిపారు.
డ్రగ్స్ను అరికట్టడంలో ప్రతి ఒకరూ భాగస్వాములు కావాలని నటుడు ప్రియదర్శి పిలుపునిచ్చారు. “నాకు పదేండ్ల కింద సిగరెట్ అలవాటు ఉండేది. దానికి బానిస కాకూడదనే ఉద్దేశంతో వెంటనే మానేశాను. ప్రస్తుతం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హాయిగా ఉన్నాను అని చెప్పారు. డ్రగ్స్ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను యువత, విద్యార్థులు గుర్తించాలని సూచించారు. డ్రగ్స్ నివారణ కోసం కృషి చేస్తున్న నారోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్వింగ్ , పోలీస్ డిపార్ట్మెంట్కు సెల్యూట్ చేస్తున్నానన్నారు.
డ్రగ్స్ అనేది ప్రస్తుతం సమాజంలో పెద్ద సమస్యగా మారిందని, దేశవ్యాప్తంగా 11.5 కోట్ల మంది డ్రగ్స్కు బానిసలయ్యారని నగర పోలీసు కమిషనర్ సీవీ.ఆనంద్ వివరించారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ , డ్రగ్స్ రెండు ప్రధాన సమస్యలుగా మారాయన్నారు. యువత, స్టూడెంట్స్ , హైప్రొఫైల్ వ్యక్తులు డ్రగ్స్కు బానిసలవుతున్నారన్నారు. పాకిస్తాన్ , అఫ్గనిస్తాన్ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతున్నదని, రాష్ట్రంలో డ్రగ్స్ను అరికట్టేందుకు యాంటీ నారోటిక్స్ బ్యూరో ఏర్పాటైందని వివరించారు. ఈ బ్యూరో ద్వారా డ్రగ్ వ్యాపారులు, వినియోగదారులను గుర్తిస్తామన్నారు. ‘మిషన్ పరివర్తన’ పేరుతో ప్రజల్లో అవగాహన కల్పించనున్నామని, ఈ క్యాంపెయిన్లో డ్రగ్స్ , సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పరివర్తన కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మార్పు రావాలని, డ్రగ్స్ నిర్ములనకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మారుస్తామని ఈ సందర్భంగా సీపీ తెలిపారు.ఈ సందర్భంగా వివిధ కళాశాల విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై పోలీసులు అవగాహన కల్పించారు.