ఉప్పల్/చర్లపల్లి, జనవరి 16 : ఉప్పల్, కాప్రా సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. రోడ్లు, కాలనీల్లో వరదనీరు చేరింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో నాలాలు పొంగిపొర్లాయి. సమీప కాలనీలోకి వరదనీరు చేరింది. ఉప్పల్ స్వరూప్నగర్లోని ప్రధాన రహదారిలో నిర్మిస్తున్న వంతెన కోతకు గురైంది. అదేవిధంగా కల్యాణపురిలో నిర్మిస్తున్న యూజీడీ లైన్లు కోతకు గురయ్యాయి. ఈ ప్రాంతంలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. చిలుకానగర్ ప్రధాన రహదారిలోని కావేరినగర్ బ్రిడ్జిపై నుంచి వరదనీరు ప్రవహించింది. చిలుకానగర్, హబ్సిగూడ, రామంతాపూర్లోని పలు ప్రాంతాల్లో వరదనీరు చేరింది. దీంతో జీహెచ్ఎంసీ సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు. చర్లపల్లి, ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ఆదివారం భారీవర్షం కురవడంతో కాలనీవాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డివిజన్ల పరిధిలోని కుషాయిగూడ శివసాయినగర్ ఫేజ్-3, సాయినగర్, కృష్ణారెడ్డినగర్, వెంకటరెడ్డినగర్, ఆఫీసర్స్ కాలనీ, అంబేద్కర్నగర్, బీఎన్రెడ్డినగర్, జమ్మిగడ్డ పరిసర కాలనీల్లో వర్షం కురవడంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. కాప్రా చెరువు నుంచి నాగారం నాలా వరకు వర్షం నీరు పెద్ద ఎత్తున చేరింది. శివసాయినగర్ ఫేజ్-3 కాలనీలోకి వర్షం నీరు చేరడంతో కాలనీవాసులు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కాప్రా చెరువు నుంచి వచ్చే వర్షం నీరు నాలా ప్రక్కన ఉండే కాలనీలోకి ప్రవహించింది. ఈ వర్షం నీటితో పాటు చెత్తా, వ్యర్థాలు, మట్టి పేరుకుపోవడంతో వెంటనే పారిశుధ్య సిబ్బంది చెత్తా, వ్యర్థాలు, మట్టిని తొలగించి బ్లీచింగ్ పౌడర్ను చల్లారు. ఈ సందర్భంగా పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ.. డ్రైనేజీ పొంగిపొర్లకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా శిథిలావస్థకు చేరుకున్న డ్రైనేజీని గుర్తించి మరమ్మతు పనులు చేపట్టడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.