హైదరాబాద్ : ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలో పలు చోట్ల వాన దంచికొట్టింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న గ్రేటర్ వాసులు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొంత ఉపశమనం పొందుతున్నారు. అత్యధికంగా కుత్బుల్లాపూర్ బీఆర్ అంబేద్కర్ భవన్ వద్ద 6.8 సె.మీ., అమీర్పేటలో 2.8 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
దాదాపు గంట పాటు కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలవడంతో జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీస్ శాఖ వెంటవెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కాగా ఉత్తర – దక్షిణ ద్రోణి రాగల 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలుండడంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.