బండ్లగూడ,జూలై 22: రాజేంద్రనగర్ సర్కిల్లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు 29 మిల్లీమీటర్ల వర్షం కురిసనట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ మాన్సూన్ సిబ్బంది సమస్యాత్మక ప్రాంతాల్లో తిరుగుతూ నీరు సాఫీగా వెళ్లేందుకు తగిన చర్యలు చేపట్టారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్, రాజేంద్రనగర్, శాస్త్రిపురం, సులేమాన్ నగర్, మైలార్దేవ్పల్లి, బుద్వేల్, శివరాంపల్లి, ఆరాంఘర్, రాంబాగ్, కాటేదాన్, నందిముస్లాయిగూడ, ఎంఎం పహాడీ తదితర ప్రాంతాల్లో సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పీవీఎన్ఆర్ఎక్స్ప్రెస్ వే వెంట ఉన్న రోడ్డుతో పాటు ప్రాధాన రహదారులపై నీరు నిలువ కుండా చర్యలు చేపట్టారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావలని జీహెచ్ఎంసీ ఉపకమిషనర్ జగన్ సూచించారు.
శంషాబాద్లో …
శంషాబాద్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన వర్షం సాయంత్రం వరకు కురియడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అత్తాపూర్లో…
వర్షం ధాటికి రహదారులన్నీ జలమయమయ్యాయి. అత్తాపూర్, హైదర్గూడ, పాండురంగానగర్, నందిముస్లాయిగూడ ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అత్తాపూర్, భరత్నగర్, హుడాకాలనీ, పాండురంగానగర్లలో రోడ్లపై నిలిచిన నీటిని తొలగించారు.