మన్సూరాబాద్, సెప్టెంబర్ 10 : నడక, వ్యాయామం ద్వారానే ఆరోగ్యవంతమైన జీవితం సాధ్యమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి ఆటోనగర్లోని మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కులో ఆదివారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4కే వాక్ పోటీలను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలిసి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ… 4కే వాక్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో నడక వల్ల లభించే సహజ ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ఎంతో అభినందనీయమన్నారు. పట్టణ, నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఫారెస్టు బ్లాకుల్లో అర్బన్ లంగ్స్ స్పేస్ (అర్బన్ ఫారెస్ట్ పార్కులు)గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కొత్తగూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ను ఉమ్మడి రాష్ట్రంలో వాణిజ్య అవసరాల కోసం నాటి పాలకులు ఇచ్చారని.. దానిని అడ్డుకొని ప్రజల అవసరాలకు కోసం పోరాడిన ఘనత ఆ ప్రాంత వాకర్స్కు దక్కుతుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం బొటానికల్ గార్డెన్ను ఎకో టూరిజం పార్కుగా అభివృద్ధి చేశామన్నారు. అటవీ ప్రాంతాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు.