ఉప్పల్, జనవరి 16 : ఆరోగ్య తెలంగాణనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్నారని చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ కంటి వెలుగు ఉచిత కంటి పరీక్షా శిబిరం ఏర్పాట్లపై కార్పొరేటర్ సోమవారం వార్డు కార్యాలయంలో ఉప్పల్ పీహెచ్సీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని, ముఖ్యంగా కంటి వెలుగు పథకంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తున్నారన్నారు. చిలుకానగర్ డివిజన్ పరిధిలోని రెండు కేంద్రాల్లో కంటి వెలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, చిలుకానగర్ మహిళా భవన్, బ్యాంక్ కాలనీ కమ్యూనిటీ హాల్లో కంటి వెలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. కంటి వెలుగు పరీక్షా కేంద్రాలలో పనిచేసే అధికారులు సమన్వయంతో పనిచేసి పేదలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ పీహెచ్సీ సిబ్బంది సిత్మతుల్లా, కరుణాదేవి, సూపర్వైజర్లు ప్రకాశ్, ప్రమీలా, గ్రేసీ భాస్కర్, బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్తో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.