సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): నగరంలో ఎలాంటి అనుమతి లేకుండా మేకప్, కాస్మోటిక్ పేరుతో క్లినిక్లను నిర్వహించడమే కాకుండా.. డీసీఏ అనుమతి లేకుండా సంబంధిత ఔషధాలను విక్రయిస్తున్న క్లినిక్లపై రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో రాయదుర్గ ప్రాంతంలోని దీప్తీ పర్మినెంట్ మేకప్ అండ్ కాస్మోటిక్ క్లినిక్, మాదాపూర్లోని వీ- స్పార్క్ వెల్నెస్ క్లినిక్ను సీజ్ చేశారు. అధికారుల కథనం ప్రకారం.. గ్రేటర్ పరిధిలోని పలుచోట్ల ఎలాంటి అనుమతులు లేకుండానే బ్యూటీ, మేకప్, కాస్మోటిక్ కేర్ పేరుతో క్లినిక్లు నిర్వహిస్తున్నారు. దీంతో కొంత మంది రోగులకు వైద్యం వికటించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఈ నెల 20, 21వ తేదీల్లో నగరంలోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న దీప్తీ పర్మినెంట్ మేకప్ అండ్ కాస్మోటిక్ క్లినిక్, మాదాపూర్లోని వీ-స్పార్క్ వెల్నెస్ క్లినిక్పై దాడులు నిర్వహించారు. అర్హులైన డెర్మటాలజిస్టులు లేకుండానే గుడ్డిగా చర్మ సంరక్షణ, చర్మ సౌందర్య సంబంధిత చికిత్స నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా డీసీఏ అనుమతి లేకుండానే బ్యూటీ ప్రొడక్ట్స్కు సంబంధించిన ఔషధాలు, ఇతర ఉత్పత్తులను సైతం విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఆ రెండు క్లినిక్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్లు రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.