కల్తీలతో తలెత్తే అనర్థాలను తెలుసుకున్నాడు. ముఖ్యంగా ప్రజారోగ్యానికి రిఫైండ్ ఆయిల్స్ చేస్తున్న చేటును గమనించాడు. ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని తలంచాడు. పాత పద్ధతులతో ప్రకృతి నూనెలను తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు మణికొండలోని టీఎన్జీవోస్ కాలనీకి చెందిన చక్రవర్తి.
28 ఏండ్ల పాటు 18 దేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి ఎంఎన్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉద్యోగ విరమణ చేసిన మణికొండ టీఎన్జీవోస్ కాలనీకి చెందిన చక్రవర్తి సహజసిద్ధ నూనెలను తయారు చేసేందుకు పూనుకున్నాడు. కోయంబత్తూరు నుంచి చెక్కగానుగ యంత్రాలను తెప్పించాడు. తన ఇంటి ఆవరణలోనే పరిశ్రమను ఏర్పాటు చేశాడు. పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ఆముదం, కుసుమ, సన్ఫ్లవర్ లాంటి ఆయిల్స్ను కండ్ల ముందే పడుతున్నాడు. ఆ నూనెలను గ్లాజు బాటిళ్లలో ప్యాక్ చేసి అమ్ముతున్నాడు. అంతేకాక వినియోగదారుల కోరిక మేరకు ఉచితంగానే డోర్ డెలివరీ చేస్తున్నాడు. గోధుమలు, సజ్జలు, జొన్నలు, చిరుధాన్యాలనూ మర పడుతూ.. కావాల్సిన వారికి అప్పటికప్పుడే అందిస్తున్నాడు.
ఎంతకాలం జీవించామన్నది కాదు.. ఎంతమందికి సేవ చేశామన్న ఆలోచనల్లోంచి పుట్టిందే ‘ప్రకృతి’ నూనెల పరిశ్రమ. ప్రకృతి సిద్ధంగా పండించిన పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ఆముదం నూనెలను తయారు చేసి అందుబాటు ధరలకే విక్రయిస్తున్నా. గానుగ నూనెలను గ్లాజు బాటిళ్లతో నిల్వ చేస్తుండగా స్థానికుల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఆదాయం కన్నా స్థానికుల ఆరోగ్యమే లక్ష్యంగా ఈ పరిశ్రమను ఏర్పాటు చేశా. – చక్రవర్తి, ‘ప్రకృతి’ నూనెల వ్యవస్థాపకుడు