వనస్థలిపురం, మే 18: సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు, కార్పొరేటర్ దవాఖానలు కాదన్న తుంటి ఆపరేషన్ను వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా దవఖాన వైద్యులు చాలెంజ్గా తీసుకొని విజయవంతం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రోత్సాహకాలతో చిన్న చిన్న వైద్యశాలల్లోనూ విశేషంగా వైద్యసేవలు అందుతున్నాయడానికి ఈ ఘటనే నిదర్శనం. ఈ శస్త్రచికిత్స వివరాలను దవాఖాన సూపరింటెండెంట్ హరిప్రియ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లెలగూడ నివాసి గుంటోజు బ్రహ్మచారి(32) కొంతకాలంగా తుంటి ఎముక సమస్యతో బాధపడుతున్నాడు. ప్రైవేట్ దవాఖానకు వెళ్లగా రూ.5 లక్షలు అవుతుందన్నారు.
ఇతర వైద్యశాలలు తిరిగినా తాము ఈ ఆపరేషన్ చేయలేమని చేతులెత్తేయడంతో బ్రహ్మచారి ఈ నెల 6న వనస్థలిపురం ఏరియా దవాఖానలో చేరారు. అన్ని పరీక్షలు నిర్వహించిన అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసి నొప్పిని తగ్గించారు. ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే మొదటి సారి అని.. అది విజయవంతం కావడం ఆనందంగా ఉందని వైద్యశాల సూపరింటెండెంట్ హరిప్రియ అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో కాలర్బోన్, మెకాలి మార్పిడి లాంటి చికిత్సలను త్వరలో నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక్కడ అన్ని పరీక్షలు, శస్త్ర చికిత్సలు ఉచితంగా చేస్తున్నామని.. రోగులు ఇక్కడి వచ్చి సేవలు పొందాలని కోరారు. శస్త్ర చికిత్స నిర్వహించిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వినయ్కుమార్, అసిసెంట్ సర్జన్ అనిల్, సిబ్బందిని ఆమె అభినందించారు.
భరించలేని నొప్పి ఉండేది..
15 ఏండ్ల క్రితం జరిగిన ప్రమాదంలో కిందపడ్డా. అప్పుడు కొంచెం నొప్పి వచ్చింది. నేను చేసే కార్పెంటర్ పనితో ఆ నొప్పి క్రమంగా పెరుగుతూ భరించలేని స్థాయికి చేరింది. అనేక కార్పొరేటర్ వైద్యశాలలు తిరిగా. కొన్ని దవఖానాల్లో రూ.5 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. వనస్థలిపురం ఏరియా దవాఖానలో ఉచితంగా శస్త్రచికిత్స చేశారు. ఇప్పుడు నొప్పి తగ్గింది. వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు.
– బ్రహ్మచారి