మణికొండ, ఆగస్టు 31 : భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని మున్సిపల్శాఖ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పమేలా సత్పతి అన్నారు. మణికొండ మున్సిపాలిటీలో గురువారం ఆమె అధికారులతో కలిసి పర్యటించారు. మున్సిపల్ కార్యాలయంతోపాటు అల్కాపూర్ టౌన్షిప్లోని ఫ్రీడం పార్కు, ఎల్ఐసీ పార్కు, వైకుంఠధామాలను సందర్శించారు. అనంతరం సర్దార్ వల్లాబాయ్ పటేల్ పార్కులో ఆమె అధికారులతో కలిసి మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా పమేలా సత్పతి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో పార్కుల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు మొక్కలను విధిగా పెంచితే భవిష్యత్తులో అవి పెరిగి భావితరాలకు మంచి వాతావరణాన్ని అందిస్తాయన్నారు. మణికొండ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాల పనితీరు అద్భుతంగా కొనసాగుతుందని తెలిపారు. సమష్టిగా ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కె.నరేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.ఫల్గుణ్కుమార్, డీఈ దివ్యజ్యోతి, మేనేజర్ రమేశ్, కౌన్సిలర్లు రామకృష్ణారెడ్డి, పద్మారావు, నవీన్కుమార్, శ్రీకాంత్స్వామి, శ్వేతా రవికాంత్రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.