సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్కు గురైన జీవన్మృతుడి అవయవాలను కుటుంబ సభ్యులు జీవన్దాన్ ద్వారా దానం చేసి మరొకరికి జీవం పోశారు. వివరాల్లోకి వెళ్తే…సంగారెడ్డి జిల్లా బిడిఎల్ ప్రాంతానికి చెందిన వేణునందం శ్రీరామ్(58) ఈనెల 27న తన నివాసంలో తీవ్ర తలనొప్పితో బాధపడుతూ చికిత్స కోసం బిడిఎల్ హాస్పిటల్లో చేరాడు.
అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం ఆయన్ని సోమాజిగూడ యశోద హాస్పిటల్కు తరలించారు. 10రోజులపాటు చికిత్స పొందిన వేణునందం శనివారం బ్రెయిన్ డెడ్కు గురయ్యాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న జీవన్దాన్ ప్రతినిధులు వేణునందం కుటుంబ సభ్యులకు అవయవదానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించగా జీవన్మృతుడి అవయవాలను దానం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులు అంగీకరించారు. దీంతో జీవన్దాన్ ఆధ్వర్యంలో వైద్యబృందం జీవన్మృతుడి నుంచి కాలేయం సేకరించారు.