సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్, రాజమండ్రిలో విక్రయిస్తున్న ముఠాను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో, సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. టీనాబ్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి కథనం ప్రకారం.. కేరళ రాష్ర్టానికి చెందిన ఎం.జి.అఖిల్ గోవాలో ఉంటాడు. అంజనా బీచ్ సమీపంలో గెస్ట్హౌస్ నిర్వహిస్తూ.. టూరిస్టులకు డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఈస్ట్గోదావరి జిల్లాకు చెందిన సూర్య కిషన్, రోహన్ పౌల్ తరచూ గోవాకు వెళ్తుండటంతో అఖిల్ పరిచయమయ్యాడు. దీంతో తరచూ గోవాకు వెళ్లి అఖిల్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్, రాజమండ్రిలో విక్రయిస్తున్నారు.
హైదరాబాద్లోని హబ్సిగూడకు చెందిన తోట సురేందర్, బిలీ అరుణ్కుమార్కు కూడా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత అఖిల్ డ్రగ్స్ విక్రయించేందుకు హైదరాబాద్కు వచ్చాడు. చందానగర్ ప్రాంతంలో అఖిల్, మిగతా నలుగురు కలుసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఇన్స్పెక్టర్లు రమేశ్రెడ్డి, రాజశేఖర్, డానియెల్ బృందాలు ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నాయి. నిందితుల నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, ఒక బైక్, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం చందానగర్ పోలీసులకు అప్పగించారు.