హయత్నగర్, ఏప్రిల్ 22 : పోలీసుల వేధింపులు తాళలేక ఓ కాలనీ అధ్యక్షుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనహయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యపేట జిల్లా నూతనకల్కు చెందిన దూడిగం మధుసూదన్(49), భార్య వినోద, కుమార్తె ఇందు, కుమారుడు సాయితో కలిసి నగరానికి వచ్చి హయత్నగర్ డివిజన్లోని లక్ష్మిప్రియా కాలనీలో స్థిరపడ్డారు. మధుసూదన్ వృత్తిరీత్యా కారు డ్రైవర్ గా పనిచేస్తూ లక్ష్మిప్రియా కాలనీకి అధ్యక్షుడిగా పదవీలో కొనసాగుతున్నాడు.
అంతకుముందు కాలనీకి మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన బూడిద యాదగిరిగౌడ్, మధుసూదన్ మధ్య కాలనీ సమస్యల విషయంలో గత మూడు నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. కాలనీ అసోసియేషన్ డబ్బులు వినియోగించుకున్నందుకు మాజీ అధ్యక్షుడు బూడిద యాదగిరిగౌడ్, ప్రస్తుత ప్రెసిడెంట్ మధుసూదన్కు చెక్ రూపంలో రూ.9 లక్షలు చెల్లించాడు. ఈ విషయమై తాను ఒక లక్ష రూపాయలకు మాత్రమే చెక్కు ఇస్తే తన అకౌంట్ నుండి రూ.9 లక్షలు డ్రా చేశారని యాదగిరిగౌడ్ హయత్నగర్ పోలీస్ స్టేషన్లో మధుసూదన్, నిరంజన్ యాదవ్పై కేసు పెట్టారు.
ఈ కేసులో పలు దఫాలుగా పోలీసులు మధుసూదన్, నిరంజన్ యాదవ్లను వారివారి కుటుంబ సభ్యులను ఇళ్ల వద్ద నుండి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారణ పేరుతో వేధింపులకు గురిచేశారు. గత పది రోజుల క్రితం సూర్యపేట జిల్లా ఆత్మకూరులో పెళ్లికి హాజరైన మధుసూదన్ ను పోలీసులు ఫోన్ లొకేషన్ ఆధారంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం అతని భార్య, పిల్లలను కూడా తీసుకొచ్చి విచారణ చేపట్టారు.
మధుసూదన్ కోర్టు నుండి బెయిల్ పొందినప్పటికి యాదగిరిగౌడ్, రమణ, వారి అనుచరులతో కుమ్మక్కై వేధింపులు చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మధుసూదన్ బుధవారం తెల్లవారుజామున ఇంట్లో సూసైడ్ నోటులో…నా ఆత్మహత్యకు కారణం బోడ యాదగిరి గౌడ్, వాళ్ల తమ్ముడు రమణ అండ్ బ్యాచ్, పోలీసుల సపోర్టు అని రాసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ లక్ష్మీనారాయణ, సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.