ఎల్బీనగర్, మార్చి 25: ఎల్బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నది వచ్చే ఎన్నికల కోసం కాదని, వచ్చే తరం కోసమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గంలోని హస్తినాపురం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి కావాలని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారన్నారు. తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ఘడ్ ప్రాంతాల ప్రజలు తమ పొలాల పక్కనే ఉన్న తెలంగాణ ప్రాంత భూములను 500 గజాల చొప్పున కొనుక్కుని, వాటిలో బోరు వేసుకుని ఉచిత కరెంటు సౌకర్యంతో తమ పంటలను పండించుకుంటున్నారన్నారు. అనేక ప్రాంతాల వారు తమ ప్రాంతాలను తెలంగాణలో కలుపాలని, లేకుంటే తెలంగాణ పథకాలు తమ ప్రాంతంలో అమలు చేయాలని కోరుతున్నారని చెప్పారు. మనందరికీ కంటి వెలుగుతో కంటి పరీక్షలు చేయించి, చల్లగా చూస్తున్న సీఎం కేసీఆర్ను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు.
ఎల్బీనగర్లో బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయమన్నారు. దేశంలోనే అత్యధిక పార్కులు ఉన్న నియోజకవర్గం ఎల్బీనగరేనని అన్నారు. హస్తినాపురం సర్వే నంబర్ 58 నుంచి 62 వరకు ఉన్న భూముల సమస్యలు మొదలుకొని..నేటి జీవో 118 భూముల సమస్యల వరకు ప్రతి సమస్యపై దృష్టిసారించి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి.. క్షేత్రస్థాయిలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించాలన్నారు. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలతో పబ్బం గడుపుతున్నారన్నారు. కార్యక్రమంలో హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్, మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మానాయక్, శ్రీనివాస్ నాయక్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సత్యం చారి, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.