డంపింగ్ కేంద్రంగా.. హస్మత్పేట చెరువు
పట్టింకోని అధికారులు
బాలానగర్, మే 2 : హస్మత్పేట చెరువుకట్ట వ్యర్థాల డంపింగ్ కేంద్రంగా తయారైంది. చెరువును సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఓ వైపు కృషి చేస్తుండగా.. అధికారులు మాత్రం అందుకు తిలోదకాలిస్తున్నారు. అధికారుల నిఘాలోపం కారణంగా చెరువు కట్ట అపరిశుభ్ర వాతావరణానికి వేదికైంది. హస్మత్పేట చెరువు సుందరీకరణకు కోట్లాది నిధులు కేటాయించి పనులు చేపట్టినా సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెరువు కట్ట దుర్గందానికి వేదికవుతున్నది. చెరువు కట్టపై భవన నిర్మాణ వ్యర్థాలు వేయరాదని నిబంధనలు ఉన్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఓ పక్కా జీహెచ్ఎంసీ అధికారులు చెరువుకట్టపై భవన నిర్మాణ వ్యర్థాలు వేయరాదని సూచిక బోర్డును సైతం ఏర్పాటు చేశారు. కానీ నిఘా మరిచారు. ఇదిలా ఉండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయాలలో యథేచ్ఛగా వ్యర్థాలను డంపింగ్ చేస్తూ తమ పని ముగించుకుంటున్నారు. కొన్ని నెలలుగా వ్యర్థాలు డంపింగ్ చేస్తున్నా..అధికారులు గానీ, అధికార యంత్రాంగం కానీ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
వ్యర్థాలు తొలగిస్తాం..
ఇదేవిషయమై కూకట్పల్లి సర్కిల్ ఏఎంసీ శ్రావన్రెడ్డిని వివరణ కోరగా తాను ఇటీవలనే ఇక్కడ బాధ్యతలు తీసుకున్నానని, తనదృష్టికి ఇలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. మంగళవారం నుంచి వ్యర్థాలు తొలగిస్తామని పేర్కొన్నారు.