సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): హాష్ ఆయిల్, గంజాయి తరలిస్తున్న రెండు వేర్వేరు గ్యాంగుల సభ్యులను భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ వివరాలను వెల్లడించారు. మహబుబాబాద్ జిల్లాకు చెందిన అజ్మీరా సూర్య ఎం.ఏ, బీఈడీ పూర్తిచేసి, కొన్నాళ్లు ప్రైవేట్ ఉద్యోగం చేశాడు. కరోనాతో ఉద్యోగం పోవడంతో తన స్వస్థలానికి వచ్చి డెయిరీ ఫామ్ను నిర్వహించాడు. నష్టాలు వచ్చాయి. దీంతో అతడు నకిలీ మద్యం తయారు చేయడంతో మూడుసార్లు గూడూర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పీడీ యాక్టు కూడా నమోదు చేశారు. జైలులో ఉన్న సమయంలో అజ్మీరాకు ఒడిశా మల్కాన్గిరికి చెందిన రాము పరిచయమయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ కలిసి హాష్ ఆయిల్ దందా షురూ చేశారు. మల్కాన్గిరిలో ఆయిల్ కొనుగోలుచేసి హైదరాబాద్, జహీరాబాద్లో విక్రయించేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మల్కాన్గిరిలో లక్ష్మణ్ అనే వ్యక్తి వద్ద 3 లీటర్ల హాష్ ఆయిల్ను లక్ష రూపాయలకు కొనుగోలుచేసి ఈనెల మూడవ తేదీన వరంగల్కు చేరుకున్నారు. అక్కడి నుంచి అజ్మీరా ఒక్కడే తన బైక్పై హాష్ ఆయిల్ తీసుకొని హైదరాబాద్ వైపు వస్తుండగా.. విశ్వసనీయ సమచారం మేరకు ఆలేర్ వద్దకు చేరుకోగానే భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఆయిల్ విలువ రూ.40 లక్షల నుంచి రూ. 42 లక్షల వరకు ఉంటుందని సీపీ తెలిపారు. అజ్మీరాను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.
గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
గంజాయి అలవాటు చేసుకొని, ఆ తర్వాత గంజాయి విక్రేతగా మారిన ఒక విద్యార్థితో పాటు వీరికి ఆర్థిక సహాయం చేస్తున్న నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ కథనం ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన పేరుమల్ల రజినీకాంత్ నకిరేకల్లో ఐటీఏ విద్యార్థి. గంజాయికి అలవాటు పడ్డాడు. అతడికి ఇన్స్టాగ్రామ్లో నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన పాత నేరస్తుడు మహ్మద్ సమీ పరిచయమయ్యాడు. ఇద్దరు కలిసి గంజాయి తెచ్చి.. విద్యార్థులకు విక్రయించాలని ప్లాన్ వేశారు. ఇందుకు ఏఆర్ కానిస్టేబుల్ బైక్ను వనస్థలిపురం మార్కెట్ వద్ద నుంచి అపహరించి పరారయ్యారు. ఒడిశా రాష్ర్టాంలోని చిత్రకొండ గ్రామానికి వెళ్లి అక్కడ 5 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. గంజాయితో హైదరాబాద్కు వస్తుండగా మహేశ్వరం, ఎల్బీనగర్ ఎస్ఓటీ, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు కలిసి ఇద్దరు నేరస్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. గంజాయి కొనుగోలు చేసేందుకు వట్కూరి సాత్విక్రెడ్డి, టోడెటి వంశీ, గడిపల్లి హేమంత్ ఆర్థిక సహాయం చేసినట్టు నిందితులు చెప్పడంతో వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.