అబిడ్స్, ఫిబ్రవరి 17 : హర్యానా రాష్ట్రంలో కురుమ సంఘం భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం ద్వారా కేటాయించేందుకు కృషి చేస్తానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ముస్లింజంగ్ వంతెన వద్ద గల రాష్ట్ర కురుమ సంఘం కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ డెలిగేట్స్- 2024 సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. షెపర్డ్ ఇండియా సమావేశం తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోవడం శుభ పరిమాణమని, కురుమలు రాజకీయంగా రాణించి, చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
మాజీ కర్నాటక మంత్రి హెచ్ఎం రేవన్న మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ర్టాల్లో 12 కోట్ల మంది కురుమలు ఉన్నారని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా కురుమలను పిలుచుకుంటారని తెలిపారు. ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ర్టాలలో దశల వారీగా కురుమ వసతి హాస్టల్ భవనాలను నిర్మించి అందులో అకాడమిక్ స్టడీ సర్కిల్లను ఏర్పాటు చేసి నిరుపేద కురుమలకు ఐఏఎస్, ఐపీఎస్ పోటీ పరీక్షలకు కోచింగ్ ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
కోకాపేటలో నిర్మించిన కురుమల ఆత్మగౌరవ భవనాన్ని ఆదివారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనుండగా ఢిల్లీలో నిర్వహించాల్సిన ఈ డెలిగేట్స్ సమావేశం రాష్ట్ర కురుమ సంఘం భవనంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశంలో షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అద్యక్షుడు ఏహెచ్ విశ్వనాథ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బూరుగడ్డ నాగేశ్, క్యామ మల్లేశం, రాష్ట్ర కురుమ సంఘం ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, ఉపాధ్యక్షులు రెక్కాల కొండల్రాజ్, కొలుపుల నరసింహ, కోశాధికారి కట్ట మల్లేశం, రేవల్లి ప్రకాశ్, కేజీ కృష్ణమూర్తి, ఎక్కాల కన్నా, రాష్ట్ర కురుమ యువత అధ్యక్షుడు తూముకుంట అరుణ్కుమార్, శివకుమార్, కాలె అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.