సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తేతెలంగాణ) : ఏడోవిడుత హరితహారానికి జీహెచ్ఎంసీ సన్నద్ధమవుతున్నది. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో విస్తారంగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఏడాది కూడా గ్రేటర్వ్యాప్తంగా కోటి మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, కూకట్పల్లి జోన్ల పరిధిలో 600 నర్సరీలలో కోటి మొక్కలను సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం ఖాళీ స్థలాలతోపాటు రహదారుల వెంబడి మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టనుంది. వీటితోపాటు ఉస్మానియా, గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్జీఆర్ఐలతోపాటు ఖాళీ స్థలాలున్న సంస్థలు, ఖాళీ స్థలాలున్న దేవాదాయశాఖ భూముల్లో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ (మియావాకీ) పద్ధతిన విరివిగా మొక్కలు నాటనున్నారు. ఇవేకాకుండా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో డివిజన్ గ్రీన్ ప్రణాళికలను పక్కాగా అమలు చేసి గ్రేటర్ను హరితమయంగా తీర్చిదిద్దనున్నారు.
గ్రీన్ హైదరాబాద్కు జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. కాలుష్య నియంత్రణకు గ్రేటర్ వ్యాప్తంగా పచ్చదనం పెంపొందించడం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు, ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు హరితహారం కార్యక్రమం దోహదం చేయనుంది. ఇప్పటికే ఆరు విడుతల్లో కోట్లాది మొక్కలు నాటి హరిత స్ఫూర్తిని చాటారు. ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా 600 నర్సరీలను ఏర్పాటు చేసింది. ఎల్బీనగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి జోన్లకుగాను ఒక్కో జోన్లో 100 నర్సరీల చొప్పున 600 నర్సరీలను ఏర్పాటు చేశారు. వార్డు కార్యాలయాలు, ఖాళీ స్థలాల్లో నర్సరీలను ఏర్పాటు చేసిన అధికారులు ఒక్కో నర్సరీలో 25 లక్షల చొప్పున వివిధ రకాల మొక్కలను సిద్ధం చేశారు. రోడ్ల వెంబడి ఏపుగా పెరిగే మొక్కలు, ఫ్లైఓవర్లకు వర్టికల్ గార్డెన్లకు వీలుగా, హెర్బల్ మొక్కలు, ఇంటి పరిసరాలు, బాల్కానీలలో పెంచేందుకు వీలుగా హోంనీడ్స్, పండ్ల మొక్కలను ఉంచారు. హరితహారం పథకం కింద కోటి మొక్కలు నాటడంతోపాటు కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు మొక్కలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.